200 కోట్ల నష్టం హీరో పైకి తోసేశారు

ఇటీవలి కాలంలో అతి పెద్ద డిజాస్టర్లు ఏవంటే తెలుగులో ఆచార్య, రాధే శ్యామ్ లు గుర్తొస్తే హిందీలో సామ్రాట్ పృథ్విరాజ్ పేరే చెబుతున్నారు. అవును 300 కోట్ల బడ్జెట్ పెడితే పట్టుమని 80 కోట్లు కూడా దాటలేక గుడ్లు తేలేసింది. ఇప్పుడా నిందని హీరో అక్షయ్ కుమార్ మీదకు తోసేస్తున్నారు నిర్మాతలు దర్శకుడు. ఈ వేషం కోసం అక్షయ్ సిన్సియర్ గా కష్టపడలేదని కనీసం స్వంతంగా మీసం పెంచుకోకుండా పెట్టుడు దాంతో సరిపుచ్చాడని దాంతో స్క్రీన్ మీద ఆ వీరత్వాన్ని ప్రేక్షకులు ఫీల్ కాలేదని విమర్శించారు.

అంతే కాదు దర్శకుడు చంద్ర ప్రకాష్ ద్వివెధి మాట్లాడుతూ అసలు ముందు అనుకున్న హీరో సన్నీ డియోల్ అని తప్పనిసరి పరిస్థితుల్లో అక్షయ్ తో సర్దుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం తీయాల్సిన మూవీని ఇప్పటి ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మలచడంలో ఫెయిల్ అయ్యామని వాపోయాడు. ఇదంతా డిజాస్టర్ కావడం వల్ల వచ్చిన తంటా. ఒకవేళ హిట్ అయ్యుంటే ఇప్పుడు కామెంట్లు చేస్తున్న వాళ్ళే తమ హీరోని పొగడ్తలతో ముంచెత్తేవారని అక్కి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు

అయినా తీసే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు లబోదిబోమనడం వల్ల లాభం లేదు. అక్షయ్ కుమార్ సైతం ఈ మధ్య క్వాలిటీని పెద్దగా పట్టించుకోకుండా వేగంగా సినిమాలు తీయడం మీదే దృష్టి పెట్టి వరస దెబ్బలు తింటున్నాడు. ఈ యుద్ధాలు చారిత్రక నేపధ్యాలు నార్త్ జనానికి బోర్ కొడుతున్నాయని బాలీవుడ్ దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. పదే పదే గ్రాండియర్ల పేరుతో అవే ప్రయత్నాలు చేస్తూ నష్టాలు తెచ్చుకుంటున్నారు. అంతా అయ్యాక చల్లగా హీరో వల్లే సినిమా పోయిందని చెప్పడం ఇదేం న్యాయం.