యంగ్ హీరో టచ్ చేశాడు

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ‘రాజావారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి, మంచి పేరు సంపాదించాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. అతడి రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ డివైడ్ టాక్‌తోనూ మంచి వసూళ్లు రాబట్టి అతడికి తొలి కమర్షియల్ సక్సెస్‌ను అందించింది. తర్వాతి చిత్రం ‘సెబాస్టియన్’ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు అతడి నుంచి వస్తున్న ‘సమ్మతమే’ ప్రామిసింగ్‌‌గా అనిపిస్తోంది.

శుక్రవారమే ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. బుధవారం ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో కిరణ్ చక్కటి స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. అన్నింటికీ తన సినిమాల గురించి నిజాయితీగా అతను మాట్లాడిన మాటలు.. కొవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన తీరు మారిపోయి థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారవడంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు హార్ట్ టచింగ్‌గా అనిపించాయి జనాలకు.

తన తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’ చూసిన వాళ్లంతా చాలా బాగుందని అన్నారని.. కానీ ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదని.. ఆ సమయంలో ఎలాంటి సినిమా చేస్తే జనాలకు నచ్చుతుందని అని ఆలోచించి.. సొంతంగా కథ రాసి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చేశానని.. ఆ చిత్రం తమ అంచనాలను మించి ఆడి తనలో ధైర్యం తెచ్చిందని కిరణ్ తెలిపాడు. ఐతే ఇప్పుడు తన కొత్త చిత్రం ‘సమ్మతమే’ రిలీజవుతుంటే చాలా టెన్షన్‌గా ఉందని.. జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం రోజు రోజుకీ తగ్గిపోతుండడమే అందుకు కారణమని కిరణ్ అన్నాడు.

ఓటీటీలకు అలవాటు పడి ఇంట్లోనే కూర్చుని టీవీల్లో, మొబైళ్లలో సినిమాలు చూస్తున్నారని.. ఇది మంచి విషయమే అయినా.. థియేటర్లకు వెళ్లి 400 మందితో కలిసి రకరకాల ఎమోషన్లు ఫీలవుతూ సినిమా చూడడం అసలైన సెలబ్రేషన్ అని.. ఆ ప్రాసెస్‌ను అందరూ ఎంజాయ్ చేయాలని, థియేటర్ల సిస్టమ్‌ను కాపాడుకోవాలని.. అందుకే తన సినిమాతో పాటు అన్ని చిత్రాలనూ థియేటర్లకే వచ్చి చూడాలని అతను కోరాడు. ‘సమ్మతమే’ సినిమా మీద ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా థియేటర్లకు వచ్చి చూడాలని.. సినిమా బాగుంటే బాగుందని చెప్పాలని, లేదంటే బాలేదనే నిజాయితీగా చెప్పాలని.. అప్పుడే తాను జాగ్రత్తగా సినిమాలు చేస్తానని కిరణ్ పేర్కొనడం విశేషం.