సూర్య, షారుఖ్ పైసా తీసుకోకుండా..

విలక్షణ నటుడు మాధవన్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేసిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. దేశం కోసం ఎంతో సేవ చేసి, చేయని నేరానికి దేశద్రోహం కేసు ఎదుర్కొని.. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఆ కేసు నుంచి బయటపడ్డ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.

ముందు ఈ చిత్రానికి మాధవన్ హీరో, నిర్మాత మాత్రమే. కానీ తర్వాత తనే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. కెరీర్లో మరే సినిమాకు పెట్టనంత సమయం ఈ సినిమా కోసం వెచ్చించాడతను. కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టుకే అంకితమై ఉన్న మాధవన్.. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తట్టుకున్నాడు. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ‘రాకెట్రీ’ ఎట్టకేలకు జులై 1న పలు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు మాధవన్.

ఈ చిత్రంలో తమిళ స్టార్ సూర్యతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలు పోషించినట్లు మాధవన్ తెలిపాడు. అంతే కాదు.. వాళ్లిద్దరూ పైసా పారితోషకం తీసుకోకుండా నటించినట్లు వెల్లడించాడు. ‘‘సూర్య తన అసిస్టెంట్లతో కలిసి ముంబయికి సొంత ఖర్చులతో షూటింగ్‌ కోసం వచ్చారు. తనతో పాటు టీం మొత్తానికి ప్రయాణ ఖర్చులు తనే పెట్టుకోవడమే కాదు.. హిందీ నుంచి తమిళంలో తన సంభాషణలు అనువదించిన వారి రెమ్యూనరేషన్ కూడా తానే భరించారు.

ఇక షారుఖ్ విషయానికొస్తే.. అతను హీరోగా నటించిన ‘జీరో’లో నేనో చిన్న అతిథి పాత్ర చేశా. ఆ టైంలోనే ఆయనకు ‘రాకెట్రీ’ కథాలోచన చెప్పా. కొన్నాళ్ల తర్వాత తన పుట్టిన రోజు వేడుకల్లో షారుఖ్ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమా తీస్తే తాను అతిథి పాత్ర చేస్తానన్నాడు. కొన్ని రోజుల తర్వాత దీని గురించి సరదాగా మెసేజ్ చేస్తే.. షారుఖ్ మేనేజర్ డేట్లు ఎప్పుడు కావాలని అడిగాడు. కానీ షారుఖ్ నటిస్తే ఆ పాత్ర ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో సమయం తీసుకుని దాన్ని బాగా తీర్చిదిద్దాక ఆయన్ని సంప్రదించాను’’ అని మాధవన్ వెల్లడించాడు.