బాస‌ర త్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 

బాస‌ర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిర‌స‌న కొన‌సాగుతోంది. క్యాంప‌స్ ను పోలీసులు చుట్టుముట్టి ఉన్నారు. మూడెంచ‌ల  భ‌ద్ర‌త కొన‌సాగుతోంది. దీనిపై విద్యార్థులు మండిప‌డుతున్నారు. విద్యార్థుల నిర‌స‌న గురువారంతో మూడో రోజుకు చేరుకుంది. 12 డిమాండ్ల‌తో కూడిన ప్ర‌ధాన అజెండాతో ఇక్క‌డి విద్యార్థులు వ‌ర్శిటీ ప్రాంగ‌ణాన నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఇప్ప‌టికే గ‌వర్న‌ర్ త‌మిళ సై కూడా స్పందించారు.

అదేవిధంగా మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కూడా స్పందించారు. అయినా కూడా విద్యార్థులు త‌మ పంతం వీడేలా లేరు. ఇక్క‌డి పోలీసులు స‌హ‌జ న్యాయ సూత్రాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న వ‌స్తోంది. క‌నీసం తాగేందుకు మంచి నీరు కూడా ఇవ్వ‌కుండా వేధిస్తున్నారని విద్యార్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదెక్క‌డి న్యాయం అని త‌మ సమ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని అడిగితే అడుగ‌డుగునా పోలీసులు ఉన్నార‌ని, ఇదెక్క‌డి ప్ర‌జా స్వామ్య మ‌ని, తాము చ‌దువుకోవడానికే వ‌చ్చామ‌ని కానీ ఏళ్ల‌కు ఏళ్లు ఇవే స‌మ‌స్య‌లు వెన్నాడితే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు వీరంతా!

ప్ర‌ధానంగా క్యాంప‌స్ ను సీఎం సందర్శించాలి. రెగ్యుల‌ర్ వీసీని నియ‌మించాలి… అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రిపుల్ ఐటీ డైరెక్ట‌ర్ గా డాక్ట‌ర్ పెద్ద‌ప‌ల్లి స‌తీశ్ కుమార్ (ఉస్మానియా యూనివ‌ర్శిటీ ఎలక్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ ప్రొఫైస‌ర్) ను హుటాహుటిన నియ‌మించారు. కానీ విద్యార్థులు త‌మ‌కు క్యాంప‌స్-లోనే ఉండే వీసీ కావాల‌ని, రెగ్యుల‌ర్ వీసీ నియామ‌కంతో పాటు విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా అధ్యాప‌కుల‌ను నియ‌మించాల‌ని వీరంతా ప‌ట్టుబ‌డుతున్నారు. 169 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట  కేవలం 15 మందే ఉన్నారు, వీసీ కూడా లేడు అన్నది విద్యార్థుల వేదన.  

ఇన్ఫ‌ర్మేష‌న్, టెక్నాల‌జీ ఆధారంగా బోధ‌న సాగించాల‌ని, ఇత‌ర వ‌ర్శిటీల‌తో ఇక్క‌డి ప్రాంగ‌ణాన్ని అనుసంధానం చేయాల‌ని కోరుతున్నారు. క్యాంప‌స్ లో త‌ర‌గ‌తి గ‌దుల‌కు, హాస్ట‌ల్ గ‌దుల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని వేడుకుంటున్నారు. ల్యాప్ ట్యాప్ లు, యూనిఫాంలు, బెడ్లు అందించాల‌ని, మెస్సుల మెయింటెనెన్స్ సరిగా ఉండేలా చూడాల‌ని,పీడీ, పీఈటీల‌నూ నియ‌మించి క్రీడ‌ల‌కూ త‌గిన ప్రోత్సాహం అందించాల‌ని వేడుకుంటున్నారు.

విద్యార్థుల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ నియామ‌కం చేప‌ట్టాక వెంట‌నే ఆయ‌న విధుల్లో చేరారు. అయిన‌ప్ప‌టికీ విద్యార్థులు శాంతించ‌లేదు. విద్యార్థుల‌తో ఇక్క‌డి కలెక్ట‌ర్, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్, ఎస్పీ ప‌లు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిపినా అవేవీ స‌ఫ‌లీకృతం కాలేదు. ఇప్ప‌టికే ఇక్క‌డి విద్యార్థుల ఆందోళ‌న‌ల‌కు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ల‌భించింది. ఆందోళ‌న చేప‌డుతున్న వారిని అత్యంత అమాన‌వీయంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వీరి ఆందోళ‌న‌ల‌కు ఎస్ఎఫ్ఐ మ‌ద్ద‌తు ఇస్తోంది. సీపీఐ నారాయ‌ణ కూడా ఇక్క‌డికి వ‌చ్చి వెళ్లారు. పోలీసు స్టేష‌న్లో ఉన్న ఆందోళ‌న‌కారుల‌ను క‌లిసి వ‌చ్చారు.