భారీ బడ్జెట్ సినిమాపై అప్ డేట్ ఇచ్చిన రానా

బాహుబలి 2 తర్వాత రానాతో గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ అనే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు. దాదాపు ౩౦౦ కోట్ల బడ్జెట్ అనుకోని ప్రీ ప్రొడక్షన్ కోసం మొదలు పెట్టాడు గుణ శేఖర్. మూడేళ్ళ పాటు ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిపారు. కానీ ఉన్నపళంగా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి సమంతతో ‘శాకుంతలం’ సినిమా స్టార్ట్ చేశాడు గుణ శేఖర్. దీంతో ఇక రానాతో గుణ శేఖర్ భారీ ప్రాజెక్ట్ ఉండదని టాక్ వచ్చేసింది. ఆ వార్తలపై రానా కానీ గుణశేఖర్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక తాజాగా విరాటపర్వం ప్రమోషన్స్ లో భాగంగా రానా కి ఆ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి వెంటనే రానా రెస్పాండ్ అయ్యాడు. హిరణ్య కశ్యప సినిమా ఉంటుందని వచ్చే ఏదాది మార్చ్ లో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని దానికోసం బాగా బడీ బిల్డ్ చేయాల్సి ఉందని చెప్పుకున్నాడు. ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్న గుణశేఖర్ త్వరలోనే రానా ‘హిరణ్య’ కు సంబందించి ఫైనల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడు.

అలాగే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా గురించి కూడా రానా మాట్లాడాడు. ఆ సినిమా షూటింగ్ కొన్ని రోజుల మినహా పూర్తయిందని ఇంత వరకూ తను రష్ కూడా చూడలేదని చెప్పాడు. ఇక బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ గా రానుందని తెలిపాడు. నెక్స్ట్ సినిమా ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకున్నాడు. విరాటపర్వంతో జూన్ 17న థియేటర్స్ లోకి రాబోతున్నాడు రానా. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.