మేజర్.. సోల్డ్ ఔట్.. సోల్డ్ ఔట్

ఏదో అనుకున్నారు కానీ.. అడివి శేష్ మీద ప్రేక్షకుల గురి మామూలుగా లేదు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో అతను జనాల మనసుల్లో బలమైన ముద్రే వేసినట్లున్నాడు. శేష్ సినిమా అంటే ఆషామాషీగా ఉండదని, నిరాశపరిచే అవకాశమే లేదని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నట్లున్నారు. ముంబయి తాజ్ హోటల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శేష్ ప్రధాన పాత్రలో ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క రూపొందించిన ‘మేజర్’ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండగా.. రిలీజ్ ముంగిట అది ఇంకా పెరిగింది.

ట్రైలర్ చూశాక ఇది స్యూర్ షాట్ హిట్ అనిపించింది. ఏం చేసినా చాలా శ్రద్ధగా, సిన్సియర్‌గా చేస్తాడని పేరు తెచ్చుకున్న శేష్.. తన టీంతో కలిసి సందీప్ కథను వెండితెరపై గొప్పగా ప్రెజెంట్ చేసి ఉంటాడని జనాలు నమ్ముతున్నారు. మామూలుగా ఇలాంటి కథల్లో ఎగ్జాజరేషన్లు ఎక్కువ ఉంటాయి. కానీ శేష్ అండ్ టీం అలా చేసి ఉండదని.. ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఈ కథను చూపించి ఉంటారనే భరోసా అందరిలో కనిపిస్తోంది.

సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప విడుదలకు పది రోజుల ముందు నుంచే పెయిడ్ ప్రిమియర్లు మొదలుపెట్టదు చిత్ర బృందం. పుణెతో మొదలుపెట్టి ఒక్కో సిటీలో ప్రిమియర్లు వేస్తుండగా.. అన్ని చోట్లా అద్భుత స్పందన వస్తోంది. ప్రతి సిటీలోనూ ఇలా టికెట్లు పెట్టగానే అలా సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి.

హైదరాబాద్‌లో ముందు ఒక్క ఏఎంబీ సినిమాస్‌లో మాత్రమే ప్రిమియర్స్ అన్నారు. కానీ జనాల్లో క్రేజ్ చూసి మేజర్ మల్టీప్లెక్సులన్నీ ప్రిమియర్స్ వేస్తున్నాయి. ఇప్పటికే ఆరు షోలకు టికెట్లు పెట్టగా.. బుక్ మై షోలో చకచకా అమ్ముడైపోయి.. సోల్డ్ ఔట్ బోర్డు పెట్టేయాల్సి వచ్చింది. ఈ క్రేజ్ చూసి షోలు ఇంకా పెంచబోతున్నారు. టాక్ తేడా కొట్టే అవకాశమే కనిపించడం లేదు కాబట్టి ‘మేజర్’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.