విక్రమ్-2 కాదు.. విక్రమ్-3 కూడా

Kamal-Haasan-Vikram

లోకనాయకుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాడు. చివరగా 2018లో ‘విశ్వరూపం-2’లో పలకరించిన ఆయన.. మళ్లీ ఇన్నాళ్లకు ‘విక్రమ్’ సినిమాతో వస్తున్నాడు. మానగరం, ఖైదీ, మాస్టర్ లాంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించిన యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

ఈ తరం నటుల్లో ది బెస్ట్ అనిపించుకున్న విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఇందులో కీలక పాత్రలు పోషించడం సినిమా మీద ముందు నుంచే ఉన్న అంచనాలను ఇంకా పెంచింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కమల్ ఈ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అవడం గ్యారెంటీ అని అంతా అనుకుంటున్నారు. ‘విక్రమ్’పై కమల్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడంటే.. ఈ సినిమాకు ఒకటి కాదు.. రెండు సీక్వెల్స్ వస్తాయని.. రెంటినీ లోకేషే డైరెక్ట్ చేస్తాడని ఆయన చెప్పడం విశేషం.

‘విక్రమ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టిన కమల్.. ‘విక్రమ్’ సీక్వెల్‌ ఆల్రెడీ ఫిక్సయిందని ప్రకటించాడు. అదే సమయంలో విక్రమ్-3 కూడా ఉంటుందని, దాన్ని లోకేషే డైరెక్ట్ చేస్తాడని ప్రకటించారు. ‘విక్రమ్’ చాలా కష్టపడి చేసిన సినిమా అని.. ఇది ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని.. ఎక్కువమందికి సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో దుబాయ్, మలేసియా, ముంబయి, హైదరాబాద్ సహా పలు చోట్ల వచ్చే వారం రోజుల్లో పర్యటించబోతున్నట్లు కమల్ వెల్లడించాడు.

ఇక తన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఇండియన్-2’ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పున:ప్రారంభించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని.. కచ్చితంగా అది పూర్తవుతుందని కమల్ తెలిపాడు. మధ్యలో నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవడంపై అభిమానులకు క్షమాపణలు చెప్పిన కమల్.. ఇకపై విరామం లేకుండా సినిమాలు చేస్తానన్నాడు. ‘విక్రమ్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.