చరణ్ అంత రిస్క్ చేశాడా

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన సంగతులు ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొత్తం మూడు పాత్రలు చేస్తుండగా, ఒకటి తండ్రి కాగా కొడుకులైన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరిది నెగటివ్ షేడ్స్ లో ఉంటుందట. ఇదే సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. ఇదేదీ యూనిట్ నుంచి అఫీషియల్ గా అందింది కాదు కానీ చిన్నపెద్ద వయసుల్లో ద్విపాత్రాభినయం మాత్రం నిజమే.

ఇది కాసేపు నిజమే అనుకున్నా చరణ్ ఇలాంటి క్యారెక్టర్స్ ద్వారా పెద్ద రిస్క్ కు సిద్ధ పడినట్టే. ఎందుకంటే ట్రిపుల్ రోల్ మన హీరోలకు అంతగా అచ్చిరాలేదు. చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు భారీ విజయాన్ని అందుకోలేక జస్ట్ ఆబోవ్ యావరేజ్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ లవకుశ కమర్షియల్ గా పాస్ అయ్యింది కానీ వసూళ్ల లెక్కలో టాప్ త్రీలోకి తీసుకోలేం. సూపర్ స్టార్ కృష్ణ రక్తసంబంధం చేశారు కానీ అది అప్పట్లో పెద్ద డిజాస్టర్. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క దానవీరశూరకర్ణ మాత్రమే దీనికి మినహాయింపు.

ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య రూపంలో పెద్దఫ్లాప్ అందుకున్న రామ్ చరణ్ అందులో చేసింది ప్రధాన పాత్ర కాకపోయినా చెప్పుకోదగ్గ స్పేస్ ఉండటంతో ఈ పరాజయం నాన్నతో పాటు తన ఖాతాలోనూ వచ్చేసింది. అందుకే శంకర్ ప్రాజెక్ట్ మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద వయసు చరణ్ తాలూకు పార్ట్ పూర్తి చేశారు. ప్రస్తుతం కియారా అద్వానీతో కలిసి కాలేజీ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం, కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు.