టాలీవుడ్ అంతర్మథనం.. అత్యాశకు పోయామా!


బంగారు గుడ్లు పెట్టే బాతుని అత్యాశకు పోయి కోసేసినట్లుగా కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో సినిమాల వ్యవహారం. దేశంలోనే మన దగ్గర ఉన్నంతగా జనాల్లో సినిమాల మీద అభిమానం ఇంకెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. థియేటరుకు వెళ్లి సినిమా చూడటం అన్నది ఇక్కడ అందరి జీవితాల్లో ఒక భాగం అనదగ్గ అలవాటు. ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు సినిమా పిచ్చోళ్లు ఉంటారు. కుటుంబాలకు కుటుంబాల్లోనూ సినిమా పట్ల మోజు ఉంటుంది. కొత్త సినిమా రిలీజవ్వగానే వారాంతాల్లో థియేటరుకు వెళ్లి సినిమా చూడటం, అట్నుంచి అటే రెస్టారెంటుకు వెళ్లడం నగరాలు, పట్టణాల్లో ఎక్కువమందికి ఉన్న అలవాటు.

ఇక కొత్త సినిమా రిలీజవ్వగానే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అలవాటున్న యువ అభిమానులకూ లెక్కే లేదు. కానీ కరోనా మహమ్మారి ఈ అలవాటుకు బ్రేక్ వేసింది. నెలల పాటు థియేటర్లు మూతపడి ఉండడంతో అందరికీ ఈ అలవాటు తప్పింది. అదే సమయంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. అది ఖర్చు తక్కువ, వినోదం ఎక్కువ కేటగిరి.

ఇలాంటి టైంలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక ప్రేక్షకులను తిరిగి వెండి తెరల వైపు మళ్లించడానికి ఏం చేయాలో ఆలోచించకుండా కొవిడ్ నష్టాలను భర్తీ చేసుకోవడానికి రేట్లు పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు నిర్మాతలు. తెలంగాణలో తేలిగ్గా ఇందుకు అనుమతులు వచ్చేశాయి. ఆంధ్రాలోనూ కష్టపడి రేట్లు పెంచుకోగలిగారు. ఐతే సాధారణ స్థాయిలో పెరిగిన రేట్లే ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేస్తుంటే.. పెద్ద సినిమాలకు తొలి పది రోజులు అదనంగా రేట్లు పెంచుకోవాలనుకోవడం కచ్చితంగా అత్యాశే. అది ప్రేక్షకులకు మోయలేని భారమే. దీని ప్రభావం సినిమాలపై బాగానే పడుతోంది. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య గత కొన్ని నెలల్లో బాగా తగ్గుతూ వస్తోందన్నది స్పష్టం.

చిరంజీవి, మహేష్ బాబు సినిమాలంటే వీకెండ్ వరకు టాక్‌తో సంబంధం లేకుండా ఫుల్స్ పడిపోయేవి. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగేవి. కానీ ఈ రెండు చిత్రాలకూ తొలి రోజే థియేటర్లు నిండని పరిస్థితి తలెత్తింది. సోషల్ మీడియా, మిగతా మీడియాల్లో రేట్ల పెంపు గురించి ఎంత చర్చ జరుగుతున్నా, ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా పట్టనట్లు ఉండిపోయారు టాలీవుడ్ నిర్మాతలు. కానీ రోజు రోజుకూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటం, థియేటర్ల అస్థిత్వమే ప్రమాదంలో పడే సంకేతాలు కనిపిస్తుండటంతో ఇప్పుడు పరిశ్రమలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. నిర్మాతలు దీని మీద అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

త్వరలో అధికారికంగానే దీని మీద సమావేశం పెట్టబోతున్నారని.. అదనపు రేట్ల జోలికి వెళ్లకపోవడం.. తప్పదనుకుంటే తొలి వీకెండ్ వరకు అది పరిమితం చేయడం.. మల్టీప్లెక్సుల్లో మొత్తంగా ఎక్స్‌ట్రా రేట్లు తీసేయడం.. సాధారణ స్థాయిలో రేటును రూ.295 నుంచి 250 లేదా 200కు తగ్గించడం లాంటి చర్యలు అవసరమని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.