మ‌హేష్ టీం డ్యామేజ్ కంట్రోల్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు య‌ధాలాపంగా అన్న ఒక మాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌కు ఎప్పుడు వెళ్తారు అంటూ మ‌హేష్ ఎప్పుడు మీడియాను క‌లిసినా విలేక‌రులు అడిగే ప్ర‌శ్ననే స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ల‌లోనూ అడిగారు. దానికి మ‌హేష్ ఎప్ప‌ట్లా రొటీన్ స‌మాధానం చెప్ప‌కుండా.. బాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అక్క‌డి వాళ్లు న‌న్ను భ‌రించ‌లేరు అన్న‌ట్లుగా జ‌వాబివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

అస‌లే నార్త్ మార్కెట్లో సౌత్ సినిమాల దూకుడుతో బాలీవుడ్ వాళ్లు మంటెత్తిపోతున్నారు. అది చాల‌ద‌న్న‌ట్లు సుదీప్ లాంటి వాళ్లు బాలీవుడ్ వాళ్ల‌ను గిచ్చుతున్నారు. ఇలాంటి టైంలో మ‌హేష్ కూడా ఇలా కామెంట్ చేయ‌డం బాలీవుడ్ జ‌నాల‌కు, అక్క‌డి మీడియా వాళ్ల‌కు రుచించిన‌ట్లు లేదు. సెల‌బ్రెటీలెవ‌రూ నేరుగా స్పందించ‌క‌పోయినా.. అక్క‌డి మీడియా వాళ్లు మాత్రం మ‌హేష్ మీద నెగెటివ్ కామెంట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఐతే ఎంతైనా నార్త్ మార్కెట్ చాలా పెద్ద‌ది. బాలీవుడ్‌కూ ఒక స్థాయి ఉంది.

అందులోనూ రేప్పొద్దున రాజ‌మౌళితో సినిమా చేశాక అది పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ‌వుతుంది. అప్పుడు ప్ర‌మోష‌న్ల కోసం ఉత్త‌రాదిన అంతా తిర‌గాలి. ఇప్ప‌టి మాట‌లు అప్పుడు ఇబ్బందిగా మార‌తాయేమో అని మ‌హేష్ అండ్ కో భ‌య‌ప‌డ్డ‌ట్లుంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొద‌లుపెట్టారు.

‘‘మ‌హేష్‌కు అన్ని భాష‌ల సినిమాల‌పై గౌర‌వం ఉంది.. అన్ని భాష‌లూ, అన్ని ఇండ‌స్ట్రీలూ ఆయ‌న‌కు స‌మాన‌మే. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తుండ‌టం వ‌ల్ల ఇవి అయితే త‌న‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటాయ‌ని మాత్రమే ఆయ‌న చెప్పారు. ఆయ‌న మాట‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు’’.. అంటూ వివ‌ర‌ణ ఇచ్చింది మ‌హేష్ పీఆర్ టీం. రాజ‌మౌళితో మ‌హేష్‌ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ‌వ‌బోతోంద‌ని కూడా ఈ టీం ప్ర‌స్తావించ‌డాన్ని బ‌ట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ డ్యామేజ్ కంట్రోల్ అన్న‌ది స్ప‌ష్టం.