హైదరాబాద్ లో ఐమ్యాక్స్ – కొత్త మల్టీప్లెక్సులు

ఒకపక్క మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు మండిపోతున్నాయి అన్ని సినిమాలు చూడలేకపోతున్నామని మధ్యతరగతి జీవులు గగ్గోలు పెడుతున్నా ఇటు డిస్ట్రిబ్యూటర్లు కానీ అటు యాజమాన్యాలు కానీ వాటిని ఆలకించే స్థితిలో లేరు. పైపెచ్చు కొత్త వాటికి శ్రీకారం చూడుతూ స్క్రీన్లను పెంచుకుంటూ పోతున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే సరిపడా థియేటర్లు ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బిజినెస్ ని విస్తరించే పనిలో పడ్డాయి కార్పొరేట్ సంస్థలు. ముఖ్యంగా పివిఆర్ ముందంజలో ఉంది.

వచ్చే సంవత్సరం అంటే 2023 సంక్రాంతికి ఒక్క భాగ్యనగరంలోనే 20 అదనపు స్క్రీన్లు రెడీ చేయబోతోందని సమాచారం. ఆర్టిసి క్రాస్ రోడ్స్ ఒడియన్ కాంప్లెక్స్ లో 9 తెరలను అందుబాటులోకి తేనున్నారు. ఒకప్పుడు ఇందులో సిల్వర్ జూబ్లీ బ్లాక్ బస్టర్లు ఎన్నో ఆడాయి. నువ్వే కావాలిది ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. ఒడియన్, మినీ ఒడియన్ కి ఎంతో ఘన చరిత్ర ఉంది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఏకంగా 11 స్క్రీన్లు రాబోతున్నాయి. ఇంత భారీ నెంబర్ తో ఏ సముదాయం తెలంగాణ రాజధానిలో లేదు.

అంతే కాదు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో బిగ్ స్క్రీన్ కు ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ తీసేశాక మళ్ళీ ఏర్పాటు చేయమనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు పంజాగుట్టాలోని పివిఆర్ సెంట్రల్ మాల్ లో రెండు స్క్రీన్లు కలిపేసి అతి పెద్ద ఐమ్యాక్స్ ఒరిజినల్ స్క్రీన్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇది ఎప్పటికి అవుతుందో చెప్పలేం కానీ టాక్ మాత్రం జోరుగా ఉంది. మొత్తానికి మూవీ లవర్స్ ఈ వార్తలు విని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకారం నైజామ్ సినిమాల షేర్ లో సింహభాగం హైదరాబాదేనని అర్థమవుతోందిగా