కొర‌టాల నాలుగేళ్ల క‌ష్టం సున్నా


ర‌చ‌యిత‌గా కొర‌టాల శివ కాస్త ఫేమ‌స్ అయ్యాడు కానీ.. మ‌రీ ఎక్కువ పేరేమీ లేదు. అత‌ను ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడంటే ఎవ‌రూ అంత‌గా ఎగ్జైట్ అయింది లేదు. కానీ తొలి చిత్రం మిర్చితో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత శ్రీమంతుడు మూవీతో ఏకంగా నాన్ బాహుబ‌లి హిట్ కొట్టేశాడు. ఆపై జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను సైతం పెద్ద విజ‌యం సాధించాయి. ఇలా తీసిన నాలుగు సినిమాల‌తోనూ సూప‌ర్ స‌క్సెస్‌లు కొట్టిన ద‌ర్శ‌కుడిగా కొర‌టాల పేరు మార్మోగింది.

అలాంటి ట్రాక్ రికార్డున్న ద‌ర్శ‌కుడు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల క‌ల‌యిక‌లో సినిమా చేస్తున్నాడ‌న‌గానే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌బోతున్న‌ట్లే అని అంతా ఫిక్స‌యిపోయారు. కానీ క‌థ అడ్డం తిరిగింది. బ్లాక్‌బ‌స్ట‌ర్ కాదు.. జ‌స్ట్ హిట్ కూడా కాలేదు ఆచార్య‌. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

క‌రోనా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొర‌టాల త‌న కెరీర్లో ఏ సినిమాకూ లేనంత స‌మ‌యాన్ని వెచ్చించాడు ఆచార్య కోసం. భ‌ర‌త్ అనే నేను 2018 వేస‌విలో విడుద‌లైతే.. ఆచార్య 2022 స‌మ్మ‌ర్లో వ‌చ్చింది. ఇంత టైం తీసుకుని, అంత కష్ట‌ప‌డి, కాపీ ఆరోప‌ణ‌లతో బ‌ద్నాం అయి సినిమా తీస్తే.. చివ‌రికి ఆ చిత్రం చేదు ఫ‌లితాన్నిచ్చింది. కొర‌టాల లాంటి ద‌ర్శ‌కుడు ఉన్న ఫాం ప్ర‌కారం చూస్తే విలువైన నాలుగు సంవ‌త్స‌రాలు వృథా అయిన‌ట్లే. ఆర్థికంగా కూడా ఈ సినిమా ఆయ‌న‌పై మోయ‌లేని భారాన్ని మోపిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఆచార్య రిలీజ‌వుతున్న‌పుడు చిరు, చ‌ర‌ణ్‌ల‌తో పాటు తాను ఇంకా పారితోష‌కం తీసుకోలేద‌ని కొర‌టాల చెప్పాడు. సినిమాకు భారీ న‌ష్టాలు వ‌చ్చి సెటిల్ చేయాల్సిన ప‌రిస్థితుల్లో కొర‌టాలకు పారితోష‌కం అంటూ ఏదైనా అందుతుందా అన్న‌దీ డౌటే. పైగా త‌నే బిజినెస్ డీల్స్ అంతా చేసిన నేప‌థ్యంలో బాధ్య‌త తీసుకుని, కొంత మేర సెటిల్మెంట్లో భాగంగా ఎన్టీఆర్‌తో తాను చేయ‌బోయే త‌ర్వాతి సినిమాతో భ‌ర్తీ చేసేలా బ‌య్య‌ర్ల‌కు హామీ ఇచ్చిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇలా చూసుకుంటే ఆచార్య వ‌ల్ల కొర‌టాల‌కు కొత్త‌గా ఆదాయం రాక‌పోగా చేతి నుంచి పోగొట్టుకున్న‌ట్లే.