సల్మాన్ ఊరికే వేసెయ్యలేదు ఆ ట్వీట్

బాలీవుడ్లో ఇప్పుడు ఏటా అత్యధిక ఆదాయం అందుకుంటున్న హీరో అక్షయ్ కుమార్ కావచ్చు. సక్సెస్ రేట్, హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల లిస్టు చూస్తే ఆమిర్ ఖాన్ ముందుండొచ్చు. కానీ బాలీవుడ్లో మోస్ట్ పవర్ ఫుల్ హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా సల్మాన్ ఖాన్ పేరు చెప్పేస్తారు ఎవరైనా. బాలీవుడ్‌ను సల్మాన్ శాసిస్తాడు అంటే అతిశయోక్తి ఏమీ కాదు.

కొన్నేళ్ల కిందట ఓ కేసులో సల్మాన్ జైలుకు వెళ్తే.. చట్టాలు గిట్టాలు జాన్తా నై అన్నట్లుగా బాలీవుడ్ ప్రముఖులందరూ మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు సోషల్ మీడియాలో. వీళ్లకు సల్మాన్‌లోని నెగెటివ్ కోణాలేవీ కూడా కనిపించవు. ఎప్పుడూ ఆయన భజనలోనే మునిగి తేలుతుంటారు. తాగి కారు నడిపి ఓ వ్యక్తి ప్రాణాలు తీయడమే కాక నలుగురు తీవ్ర గాయాల పాలవడానికి కారణమైన కేసుతో పాటు కృష్ణ జింకల కేసులో సల్మాన్ ప్రధాన నిందితుడు. ఇంకా కొన్ని వివాదాల్లో ఆయన పాత్ర ఉంది.

ఇప్పుడు చూస్తే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారంతో సల్మాన్ ఎన్నడూ లేనంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. సల్మాన్‌కు ‘దబంగ్’ లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన అభినవ్ కశ్యప్‌ దీని సీక్వెల్ తీయడానికి అంగీకరించలేదని తర్వాత అవకాశాలు రానివ్వకుండా సల్మాన్ కుటుంబం ఎలా కుట్రలు చేసిందో అతను కూలంకషంగా వివరించాడు. అంతే కాక బాలీవుడ్ మూవీ మాఫియాలో సల్మాన్ పాత్ర కీలకం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుశాంత్ ఆత్మహత్యకు సల్మాన్ పరోక్ష కారణమంటూ అతడి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జియా ఖాన్ ఆత్మహత్యకు కారణమైన సూరజ్ పంచోలిని కేసు నుంచి తప్పించింది సల్మానే అంటూ ఆమె తల్లి ఆరోపించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ సోషల్ మీడియాలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. మీడియా కూడా ఇదే అదనుగా భావించి అతడి మీద నెగెటివ్ వార్తలు ప్రచురిస్తోంది. మొత్తంగా సల్మాన్ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే సుశాంత్ అభిమానుల ఆరోపణల్ని, శాపాల్ని పట్టించుకోవద్దని, వారి ఆవేదనను అర్థం చేసుకోమని సల్మాన్ తన అభిమానులకు సూచిస్తూ ట్వీట్ వేశాడు. మామూలుగా ఇలాంటి వ్యవహారాలను అసలు పట్టించుకోని సల్మాన్.. ఇలా ట్వీట్ వేశాడంటే ఎంతగా సెగ ఎదుర్కొన్నాడో అర్థమవుతోందని బాలీవుడ్ విశ్లేషకులంటున్నారు.