రేవ్ పార్టీ.. సీఐపై సస్పెన్షన్ వేటు

టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. శనివారం అర్ధరాత్రి దాటాక బంజారా హిల్స్‌లోని ఒక పబ్ మీద పోలీసులు దాడి చేయడం.. నాగబాబు తనయురాలు కొణిదెల నిహారిక, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురిని అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపడం తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లుగా చెబుతున్నారు. ఆ టైంలో పబ్‌లో ఉండటం తప్పేమీ కాదు కానీ.. అక్కడ డ్రగ్స్ దొరకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిహారిక, రాహుల్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు కానీ.. ఈ వ్యవహారంతో వీళ్లిద్దరి పేర్లు మీడియాలో, సోషల్ మీడియాలో బాగా నానుతున్నాయిప్పుడు. ఈ పబ్‌‌కు వచ్చే వారి ఆగడాలు శ్రుతి మించుతున్నాయని, చుట్టూ ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పోలీసులు మామూళ్లు తీసుకుని కంప్లైంట్స్ వచ్చినా పట్టించుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్ సీఐ శివచంద్ర మీద పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏసీపీ సుదర్శన్‌కు ఆయన ఛార్జ్ మెమో ఇచ్చినట్లు తెలిసింది. ఈ పబ్‌లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంటోందని, వీకెండ్స్‌లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విపరీతమైన గోలగా ఉంటోందని, చుట్టు పక్కల వాళ్లను నిద్రపోలేని స్థాయిలో రభస చేస్తున్నారని స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారట.

కానీ చర్యలు లేవు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి సదరు పబ్ ముందు మాటు వేసి.. తెల్లవారుజామున రైడ్ చేశారు. ఆ సమయంలో నిహారిక, రాహుల్ సహా 150 మంది దాకా పబ్‌లో ఉన్నట్లు తెలిసింది. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నిహారిక, రాహుల్ సహా పలువురిని పోలీసులు విడిచిపెట్టారు కానీ.. ఈ కేసు నుంచి అయితే వాళ్లు పూర్తిగా బయటపడినట్లు కాదు. ఈ వ్యవహారం మున్ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.