టైగ‌ర్ క‌థ ముందు మెగాస్టార్ కే చెప్పారట!

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు.. మాస్ రాజా ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌లో మొద‌లైన కొత్త చిత్రం. ఇంత‌కుముందు దొంగాట‌, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చ‌త్రాల‌ను రూపొందించిన వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో బ‌హు భాషా చిత్రంగా ఇది తెర‌కెక్క‌బోతోంది. ఉగాది రోజు హైద‌రాబాద్‌లో శ‌నివారం అంగ‌రంగ వైభ‌వంగా ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి హాజ‌రయ్యారు. 

ఈ సంద‌ర్భంగా చిరు మాట్లాడుతూ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు క‌థ ముందు త‌న ద‌గ్గ‌రికే వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పారు. ద‌ర్శకుడు వంశీ త‌న‌తో ఈ సినిమా చేయాల‌నుకుని క‌రోనా టైంలో క‌థ వినిపించాడ‌ని, చాలా చ‌క్క‌గా క‌థ చెప్పాడ‌ని, స్టోరీ కూడా త‌న‌కు న‌చ్చింద‌ని, కానీ ఈ సినిమా చేయ‌డం త‌న‌కు సాధ్య‌ప‌డ‌లేద‌ని చిరు వెల్ల‌డించారు.

ఇప్పుడు త‌న త‌మ్ముడు ర‌వితేజ ఈ సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చిరు అన్నారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు గురించి త‌న చిన్న‌త‌నంలోనే విన్నాన‌ని.. త‌న తండ్రి చీరాల‌లో పోలీస్ ఉద్యోగం చేస్తున్న‌పుడు.. ప‌క్క‌నే ఉన్న స్టూవ‌ర్టుపురంలో అక్క‌డి జ‌నాలు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావును హీరోగా కొనియాడుతుండేవార‌ని అన్నారు.

ఇక అత‌డి గురించి ద‌ర్శ‌కుడు వంశీ పూర్తిగా తెలుసుకుని, క‌మ‌ర్షియ‌ల్‌గా తీర్చిదిద్దుతున్నాడ‌ని.. క‌శ్మీర్ ఫైల్స్‌తో మంచి స‌క్సెస్ సాధించిన అభిషేక్ అగ‌ర్వాల్ ఈ సినిమాను పెద్ద ఎత్తున నిర్మించ‌డానికి పూనుకోవ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని.. క‌చ్చితంగా ఈ సినిమా విజ‌య‌వంతం అవుతుంద‌ని చిరు ధీమా వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాది విడుద‌ల‌య్యే అవ‌కాశ‌మున్న టైగ‌ర్ నాగేశ్వ‌రరావు చిత్రంలో ర‌వితేజ‌కు జోడీగా నుపుర్ స‌న‌న్, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ న‌టిస్తున్నారు.