అక్షయ్ సినిమా బతికిపోయింది

ఒక స్టార్ హీరో సినిమా వస్తుంటే చిన్న సినిమాలు దానికి ఎదురు వెళ్లడానికి భయపడాలి. కానీ ఇప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితి తలెత్తుతోంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే హిందీ సినిమా ధాటికి పెద్ద హీరోల సినిమాలు భయపడే పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ పోటీని తట్టుకోలేక చతికిలపడింది. ప్రభాస్ సినిమా ముందు ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిలవడం కష్టం అని రిలీజ్ ముంగిట అంతా అనుకున్నారు. కానీ చివరికి పరిస్థితి తలకిందులైంది. ‘కశ్మీర్ ఫైల్స్’ ముందు ప్రభాస్ సినిమానే  నిలవలేకపోయింది.

‘రాధేశ్యామ్’ను లేపేసి థియేటర్లలో ‘కశ్మీర్ ఫైల్స్’ వేసే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకూ స్క్రీన్లు, కలెక్షన్లు పెంచుకుంటూ పోతున్న ‘కశ్మీర్ ఫైల్స్’ను చూసి అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటించిన ‘బచ్చన్ పాండే’ను ఈ నెల 18న రిలీజ్ చేయాలా వద్దా అన్న సంశయం ట్రేడ్ వర్గాల్లో కలగడం గమనార్హం. ఒక దశలో వాయిదా గురించి కూడా మేకర్స్ ఆలోచించినట్లు వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఇంకో డేట్ దొరకడం కష్టమని భావించి 18నే ధైర్యం చేసి రిలీజ్ చేసేశారు.

ఐతే సినిమాకు మంచి టాక్ రావడం, ‘కశ్మీర్ ఫైల్స్’ పోటీని తట్టుకుని తొలి రోజు మంచి వసూళ్లే సాధించడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాకు తొలి రోజు ఇండియాలో రూ.13 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాల్లో నమ్మకమే లేదు. 

తమిళంలో కొన్నేళ్ల కిందట సిద్ధార్త్ హీరోగా, బాబీ సింహా విలన్ పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘జిగర్ తండ’కు ఇది రీమేక్. తెలుగులో ఇదే చిత్రం ‘గద్దల కొండ గణేష్’గా రీమేక్ అయింది. తమిళంలో బాబీ సింహా, తెలుగులో వరుణ్ తేజ్ చేసిన పాత్రను అక్షయ్ కుమార్ చేయగా.. తమిళంలో సిద్ధు, తెలుగులో అధర్వ చేసిన అప్ కమింగ్ డైరెక్టర్ పాత్రను.. అమ్మాయిగా మార్చేశారు. ఆ పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ చిత్రాన్ని ఫర్హద్ సాంజీ రూపొందించాడు.