సినిమా సూపర్.. కానీ కలెక్షన్లు లేవు

కరోనా దెబ్బకు ఇండియాలో బాలీవుడ్ అంతగా కుదేలైన ఫిలిం ఇండస్ట్రీ ఏదీ లేదనే చెప్పాలి. కరోనా దెబ్బను తట్టుకుని మిగతా సినీ పరిశ్రమలు బాగానే నిలబడ్డాయి కానీ.. బాలీవుడ్ మాత్రం పుంజుకోవడానికి ఇంకా చాలా కష్టపడుతూనే ఉంది. గత రెండేళ్లలో చాలా వరకు హిందీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అదే సంఖ్యలో పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. గత రెండేళ్లలో థియేటర్ల నుంచి వచ్చిన ఆదాయం నామమాత్రం అనే చెప్పాలి. ‘సూర్యవంశీ’ మినహాయిస్తే ఏ చిత్రం ప్రభావం చూపలేకపోయింది.

ఐతే కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గాక ఆలియా భట్-సంజయ్ లీలా బన్సాలీల ‘గంగూబాయి కతియావాడీ’ గత వారమే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కొంత సందడి చేసింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ వసూళ్లు వంద కోట్ల మార్కును కూడా అందుకున్నాయి. ఇది సంతోషించదగ్గ విషయమే. ఈ ఊపు చూసి తర్వాతి వారం ఒక పేరున్న చిత్రాన్ని థియేటర్లలోకి దించారు. అదే.. జుండ్.లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించిన సినిమా ఇది.

మరాఠీ మూవీ ‘సైరాట్’తో సంచలనం రేపిన నాగరాజ్ మంజులె దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా ఇది. ఒక ఫుట్ బాల్ కోచ్ మురికివాడల పిల్లల్ని ఎంచుకుని వాళ్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి పడే కష్టం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ‘జుండ్’ చూసిన ప్రతి ఒక్కరూ అద్భుత చిత్రం అంటున్నారు. రివ్యూలన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. సోషల్ మీడియాలో కూడా అందరూ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్లే లేవు. తొలి రోజు ఇండియా మొత్తం కోటిన్నర గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందీ సినిమా.

రెండో రోజూ వసూళ్లు రూ.2 కోట్ల లోపే వచ్చాయి. ఆదివారం వసూళ్లు కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి. అమితాబ్ బచ్చన్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లంటే చాలా తక్కువనే చెప్పాలి. కరోనా టైంలో ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. పెద్ద పెద్ద సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసి వాటికి బాలీవుడ్డే అలవాటు చేసింది. ఇప్పుడిక భారీ, కమర్షియల్ హంగులున్న చిత్రాలకు తప్ప ఎక్కువమంది థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ‘జుండ్’ లాంటి మంచి సినిమాకు గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి.