ఆ సినిమా థియేటర్లలోకే రావాలంటున్న సుశాంత్ ఫ్యాన్స్

మూడు రోజలు కిందట ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ చివరగా ‘చిచోరే’ లాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాని తర్వాత ‘డ్రైవ్’ అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ‘చిచోరే’తోనే సుశాంత్‌ ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు.

ఐతే అది అతడి చివరి సినిమా కాదు. ‘దిల్ బేచరా’ అనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లాక్ డౌన్ లేకుంటే ఆ సినిమా ఇప్పటికే విడుదలయ్యేది కూడా.

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ముకేష్ చబ్రా దర్శకత్వం వహించాడు. సంజన సంఘి కథానాయికగా నటించిన ‘దిల్ బేచరా’లో సైఫ్ అలీ ఖాన్ ఓ కీలక పాత్ర చేశాడు. అనివార్య కారణా వల్ల ఈ సినిమా కొంత ఆలస్యమవుతూ వచ్చింది. ‘చిచోరే’ కంటే ముందే మొదలైన ఈ చిత్రం.. దాని కంటే ముందే విడుదల కావాల్సింది కూడా.

‘దిల్ బేచరా’కు సంబంధించి సుశాంత్ పని అంతా పూర్తయింది. ఇక అతను ఈ సినిమాను ప్రమోట్ చేయడమే మిగిలి ఉంది. అతనిప్పుడు లేడు. ఇప్పుడిప్పుడే థియేటర్లు కూడా తెరుచుకునే అవకాశం లేదు కాబట్టి ‘దిల్ బేచరా’ను నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేద్దామని నిర్మాణ సంస్త చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని నెలలు గడిస్తే సుశాంత్‌ను అందరూ మరిచిపోతారని.. కాబట్టి వెంటనే విడుదల చేస్తే ఆ సినిమాను ఎక్కువమంది చూస్తారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కానీ సుశాంత్ అభిమానులు మాత్రం ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలా చేస్తే సుశాంత్‌ను అవమానించినట్లే అంటున్నారు. ‘దిల్ బేచరా’ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని.. అలా చేస్తేనే సుశాంత్‌ మీద జనాలకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని.. థియేటర్లలో సుశాంత్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి అతడికి ట్రిబ్యూట్ ఇచ్చే అవకాశం తమకివ్వాలని వాళ్లు కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు ఫ్యాన్స్.