‘భీమ్లా నాయక్’ ఈవెంట్.. సింపుల్ గానే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘భీమ్లానాయక్’. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా, ఇతర కారణాల వలన వాయిదా పడింది. సంక్రాంతి రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 25న విడుదల కానుంది. 

నిజానికి ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో పవన్ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాదని.. ఏప్రిల్ 1న వస్తుందని అన్నారు. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నా.. సినిమాను ఫిబ్రవరి 25న పక్కా రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. దీంతో ఆ సమయానికి రావాలనుకున్న సినిమాలు ఇప్పుడు డైలమాలో పడ్డాయి. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘భీమ్లానాయక్’ ప్రమోషన్స్ జోరుగా నిర్వహించాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన రెండు టీజర్లు, పాటలను విడుదల చేశారు. ఇప్పుడు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోని ఈ నెల 21న ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నారు. గెస్ట్ లను పిలవకుండా.. సింపుల్ గా చిత్రయూనిట్ అండ్ పవన్ కళ్యాణ్ తో ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. 

గతంలో చాలా సినిమాల ఈవెంట్స్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోనే జరిగాయి. ఎంత పకడ్బందీగా ప్రణాళికలు వేసుకున్నా.. ఫ్యాన్స్ ను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే క్రౌడ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ సినిమా తరువాత పవన్ ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ వంటి సినిమాల్లో నటించనున్నారు.