టాలీవుడ్‌కు కొత్త కేరాఫ్ అడ్రస్?

మద్రాసు నుంచి వచ్చేశాక హైదరాబాదే తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రంగా మారింది. ఐతే పరిశ్రమకు కేంద్రంగా ఈ నగరమే ఉన్నప్పటికీ ఒకప్పుడు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున షూటింగ్స్ జరిగేవి. ఔట్ డోర్ షూటింగ్ అంటే చాలు వైజాగ్‌కు వెళ్లిపోయేవాళ్లు అప్పటి దర్శకులు. కానీ కాల క్రమంలో పరిస్థితులు మారిపోయాయి. వైజాగ్‌‌ను పక్కన పెట్టేశారు. అప్పుడప్పుడూ ఏదో ఒక సినిమా తప్పితే వైజాగ్‌ రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది.

ఏ ఉత్తరాది ప్రాంతాలకో, విదేశీ లొకేషన్లకో వెళ్తారు తప్ప.. మన దగ్గరే ఉన్న సుందర నగరాన్ని షూటింగ్స్ కోసం ఎంచుకునేవాళ్లు తగ్గిపోయారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక విశాఖను తెలుగు సినిమాలకు సెకండ్ ఫిలిం హబ్‌గా మార్చే ప్రతిపాదనలు వినిపించాయి కానీ.. అవేమీ ఆచరణకు నోచుకోలేదు. కానీ విశాఖను ఏపీ కొత్త రాజధానిగా మార్చే పనిలో ఉన్న జగన్ సర్కారు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

సినీ పరిశ్రమను వైజాగ్‌కు రప్పించే విషయంలో జగన్ చాలా పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవిల తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నేపథ్యంలో విశాఖ నగరాన్ని సినీ హబ్‌గా మార్చే దిశగా అడుగులు పడ్డట్లే చెబుతన్నారు. విశాఖలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సింగిల్‌ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు.

ఇప్పటికే దిగ్గజ నిర్మాత రామానాయుడు బీచ్‌ రోడ్డులోని రుషికొండకు సమీపంలో 35 ఎకరాల్లో స్టూడియో నిర్మించారు. ఇప్పుడు దాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్త స్టూడియోల నిర్మాణంపై జగన్ సర్కారు దృష్టి పెట్టనుందని సమాచారం. విశాఖ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సినీ హబ్‌ ఏర్పాటు చేసి.. దక్షిణాది సినీ నిర్మాతలందరికీ గమ్యస్థానంగా మార్చేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు.

ఇప్పుడు సినీ జనాలు కొంత చొరవ తీసుకుంటే సినీ పరిశ్రమ కేవలం హైదరాబాద్ మీద ఆధారపడాల్సిన పని ఉండదని.. విశాఖ టాలీవువడ్‌కు కొత్త కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.