బయటపడిన అతి పెద్ద మోసం

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఫ్రాడ్ బయటపడింది. గుజరాత్ లోని ఒక వ్యాపార సంస్ధ బ్యాంకులను రు. 22,842 కోట్లను చేసిన మోసంపై సీబీఐ కేసు నమోదుచేసింది,  ఇప్పటివరకు బ్యాంకులను మోసం చేసిన అతిపెద్ద ఘటనగా తాజా కేసు రికార్డు సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటంటే గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్ధ ఉంది. ఈ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని అనేక బ్యాంకుల్లో అప్పులు తీసుకుని మోసం చేసినట్లు బయటపడింది.

సంస్ధ మాజీ ఛైర్మన్, ఎండీ రిషీ కమలేష్ అగర్వాల్ తో పాటు శంతనం ముత్తుస్వామి, అశ్వనీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవేతియా తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత మోసం, కుట్ర, విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం లాంటి అనేక కేసులను సీబీఐ నమోదు చేసింది.  సూరత్ , బరూచ, ముంబయ్ , పూణే తదితర ప్రాంతాల్లోని సంస్ధ ఆఫీసులపై దాడులు చేసి కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జరిగిన మోసాన్ని ఎస్బీఐ 2019లోనే గుర్తించి వెంటనే ఫిర్యాదు చేసింది. 2020 మార్చిలో సీబీఐ మరిన్ని వివరాలను కోరింది. అయితే 2020 ఆగష్టులో మరోసారి బ్యాంకు రెండోసారి ఫిర్యాదు చేసింది. చివరకు ఈనెల 7వ తేదీన బ్యాంకు పై సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ సంస్థ 28 బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థల దగ్గర వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది.  ఎస్బీఐ నుండే రు. 2,468 కోట్లు అప్పు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది.

బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను నిందితులంతా భారీ ఎత్తున దారి మళ్ళించినట్లు సీబీఐ గుర్తించింది. ఏ కారణంతో అయితే అప్పులు తీసుకున్నారో దానికి భిన్నంగా నిధులను మళ్ళించినట్లు ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడింది. మరింత పెద్ద ఎత్తున జరిగిన మోసంలో నిందితులకు ఎప్పటికి శిక్షలు పడతాయో ? ఇంతకుముందే మోసాలు బయటపడి, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ వ్యవహారాలు ఎప్పటికి తేలుతాయో ఎవరికీ అర్థం కావటం లేదు.