హరీష్ శంకర్ బాలీవుడ్ డెబ్యూ!

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి చెందిన చాలా మంది దర్శకులు హిందీలో సినిమాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి, వి.వి.వినాయక్ ఇలా చాలా మంది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఓ రీమేక్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. 

గత రెండేళ్లుగా హరీష్ శంకర్ నుంచి ఒక్క సినిమా కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. పవన్ కి ఉన్న వేరే కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతుంది. ఈ బ్రేక్ ను ఇతర స్క్రిప్ట్స్ కోసం వినియోగిస్తున్నారు హరీష్ శంకర్. ఇప్పటికే ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. దిల్ రాజుతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కి హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు. 

సి. చంద్ర మోహన్ అనే వ్యక్తి ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు హరీష్ శంకర్ ను బాలీవుడ్ కి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు దిల్ రాజు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. 

ఇప్పటికే హరీష్ శంకర్ బాలీవుడ్ కి తగ్గట్లుగా ‘డీజే’ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ హీరో బాలీవుడ్ రీమేక్ లో నటించబోతున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ.. డివైడ్ టాక్ తెచ్చుకుంది. మరి బాలీవుడ్ లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!