సుమంత్ సినిమా ఓటీటీకి

అక్కినేని కుటుంబ ఘన వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. హీరోగా ఎప్పుడూ నిలకడగా విజయాలందుకోలేకపోయాడు, హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు సుమంత్. సత్యం, మధుమాసం, గోదావరి, మళ్ళీ రావా.. ఇలా అప్పుడప్పుడూ ఓ హిట్టు కొట్టినా.. ఆ ఊపును కొనసాగించడంలో విఫలమయ్యాడు. ‘మళ్ళీ రావా’తో చాన్నాళ్లకు ఓ హిట్ కొట్టినా ఆ తర్వాత వరుసగా పరాజయాలే పలకరించాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘కపటధారి’ దారుణమైన ఫలితాన్నందుకుంది.

ఐతే పరాజయాలతో సంబంధం లేకుండా సుమంత్ సినిమాలు మాత్రం చేసుకుపోతున్నాడు. అతడి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి.. మళ్ళీ మొదలైంది.

ఈ చిత్రం చాలా రోజుల ముందే విడుడదలకు సిద్ధమైంది. ట్రైలర్ సైతం లాంచ్ చేశారు. కానీ థియేట్రికల్ రిలీజ్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడిక కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావంతో రిలీజ్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘మళ్ళీ మొదలైంది’ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు ఇచ్చేశారు. జీ5 సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు కానీ.. జీ5లోనే డైరెక్ట్‌గా ఈ సినిమా విడుదల కాబోతోందని అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్.

ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఆమెతో విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్న వ్యక్తి.. తన విడాకుల కేసును వాదించిన లాయర్‌తో ప్రేమలో పడటం.. ఇద్దరూ పెళ్లికి రెడీ అవడం.. తర్వాత వీళ్లిద్దరి మధ్య కూడా విభేదాలు రావడం.. ఈ నేపథ్యంలో నడిచే కథ ఇది. ‘మళ్ళీ రావా’ సెంటిమెంటుతో ఈ చిత్రానికి ‘మళ్ళీ మొదలైంది’ అనే టైటిల్ పెట్టుకున్నట్లున్నాడు సుమంత్. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేసిన నైనా గంగూలీ ఇందులో పద్ధతైన పాత్రలో కనిపించబోతోంది. మరి ఈ సినిమాతో అయినా సుమంత్ ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి.