ఏపీ ఏడిపిస్తోంది.. ఎర్రన్న ఎమోషనల్

ఏపీలో సినిమా థియేటర్లపై దాడులు హాట్ టాపిక్గా మారాయి. గడిచిన కొద్దిరోజులుగా అక్కడక్కడ దాడులు జరిగితే.. 3 రోజుల్లో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది. దాదాపు ఏ సెంటర్లో చూసినా.. తనిఖీల అంశం థియేటర్ యజమానులను బెంబేలెత్తిస్తోంది! ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేసేస్తున్నారు అధికారులు..! జేసీల ఆధ్వర్యంలో సాగుతున్న ఈ తనిఖీల్లో రెవెన్యూ, పోలీసులతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొంటున్నారు. ప్రతి అంశాన్ని సిరీయస్గానే పరిగణిస్తున్నారు.

కొన్ని థియేటర్లను ఏకంగా సీజ్ చేసేశారు! ఈ పరిణామాలపై ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల అయితే.. స్వయంగా యజమాన్యాలే థియేటర్లను మూసివేసే చిత్రాలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు తాజా పరిణామాలపై హీరో నాని..చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నాని కామెంట్స్పై ఏపీ మంత్రులు ఘాటుగానే స్పందించారు. హీరో సిద్ధార్థ్ కూడా పలు కామెంట్స్ చేశాడు. ఇక‌, ఇదే అంశంపై వైసీపీ సానుకూల ద‌ర్శ‌క‌, నిర్మాత‌, హీరో.. నారాయ‌ణ‌మూర్తి కూడా హాట్ కామెంట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు మూస్తుంటే ఏడుపొస్తుందని  రిక్షావోడు.. ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. యజమానులారా.. థియేటర్లు మూసేయొద్దు అని నారాయణమూర్తి కోరారు. ఈ విషయంలో తెలుగు నిర్మాతల మండలి, ‘మా’ జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను కాపాడుకోవాలని ప్రాధేయపడ్డారు. పండగ వేళ సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితి రావొద్దని అన్నారు.

యజమానులు.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలని నారాయణమూర్తి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై సినీ పరిశ్రమ పెద్దలు దృష్టిపెట్టాలని కోరారు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్రాజు కూడా నాని కామెంట్స్పై స్పందించారు. హీరో నాని వ్యాఖ్యలను వక్రీకరించడం తప్పని అన్నారు. థియేటర్ల గురించి నాని భావోద్వేగంతో మాట్లాడారని.. అతడిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని స్పష్టం చేశారు.