రాధేశ్యామ్ టీం వినూత్న ప్రయోగం

‘అఖండ’ సందడి పూర్తయింది. ఇప్పుడిక ‘పుష్ప’ హంగామా మొదలైంది. మధ్యలో వేరే సినిమాలు ఉన్నప్పటికీ.. ఇక ఆటోమేటిగ్గా సంక్రాంతి సినిమాల మీదికి ఫోకస్ వెళ్తుంది. సంక్రాంతి ముంగిట రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం టీం ఇప్పటికే ప్రమోషన్లు హోరెత్తిస్తోంది. ఈ నెల 19న ముంబయిలో భారీ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఇక సంక్రాంతి రోజే రిలీజ్ కాబోతున్న ‘రాధేశ్యామ్’ టీం ఇప్పటిదాకా పాటల రిలీజ్‌తో సోషల్ మీడియా వరకే ప్రమోషన్లను పరిమితం చేసింది.

ఇక ఆఫ్ లైన్ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మామూలుగా ప్రి రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా శిల్ప కళా వేదిక, జేఆర్సీ కన్వెన్షన్ లాంటి వేదికల్లో జరుగుతుంటాయి. కానీ అక్కడ పరిమిత సంఖ్యలోనే అభిమానులకు చోటుంటుంది.

ఐతే ప్రభాస్ రేంజికి తగ్గట్లు ఓపెన్ గ్రౌండ్లో ‘రాధేశ్యామ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ చేసి.. ఎక్కువమంది అభిమానులకు అవకాశం కల్పించాలని చిత్ర బృందం భావించింది. ముందు ఎల్బీ స్టేడియంలో వేడుక చేయడానికి ప్రయత్నించారు కానీ.. అనుమతులు రాలేదు. దీంతో ‘బాహుబలి’ ఈవెంట్‌కు వేదికైన రామోజీ ఫిలిం సిటీలోనే ఈ ఈవెంట్ చేయడానికి నిర్ణయించారు. అక్కడ ఈవెంట్ కోసం పెద్ద గ్రౌండ్ లాంటిది తీసుకుని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఈవెంట్‌ను స్పెషల్‌గా చేయడానికి ఒక వినూత్న ప్రయోగం చేస్తోంది రాధేశ్యామ్ టీం. ఈ కార్యక్రమాన్ని కేవలం తెలుగు అభిమానులకు పరిమితం చేయకుండా.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అభిమానులను ఆహ్వానిస్తున్నారు. అంతే కాదు.. ‘రాధేశ్యామ్’ ట్రైలర్‌ను ఎవరో ప్రముఖుల చేతుల మీదుగా కాకుండా ఎంపిక చేసిన కొందరు ఫ్యాన్స్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. తద్వారా అభిమానులకు ప్రభాస్ ఇచ్చే ప్రయారిటీ ఎలాంటిదో చూపించబోతున్నారు. ఈ ఆలోచన పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.