బాల‌య్య పాట‌.. మ‌ధ్య‌లో ఈ పంచ్ ఏంటి?

Balakrishna Song

నంద‌మూరి బాల‌కృష్ణ ఇంత‌కుముందు పైసా వ‌సూల్ సినిమా కోసం గొంతు స‌వ‌రించుకున్నాడు. మామా ఏక్ పెగ్ లా.. అంటూ తాగుబోతుల్ని సంబ‌రాల్లో ముంచెత్తే ఓ పాట పాడాడు. మళ్లీ ఇప్పుడాయ‌న పాట పాడే సాహ‌సం చేశాడు. దీని గురించి కొన్ని రోజుల కింద‌టే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో బాలయ్య చూచాయిగా చెప్పాడు.

ఇప్పుడు దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. బుధ‌వారం బాల‌య్య పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ముందు రోజు ఈ పాట‌ను లాంచ్ చేయ‌బోతున్నారు. దీని గురించి టాలీవుడ్ ప్ర‌ముఖ పీఆర్వోలు, కొంద‌రు ఫిలిం సెల‌బ్రెటీలు ట్వీట్లు వేశారు. ఐతే దీనికి సంబంధించి త‌యారు చేసిన పోస్ట‌ర్ మీద ఉన్న వాక్యాలు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీశాయి.

నిన్న త‌ప్పు చేసిన వారిని నిల‌దీసింది ఆ గ‌ళం.. నేడు ఆ బాల గోపాలాన్ని అల‌రించ‌డానికి పాడింది ఆ గ‌ళం.. ఇదీ ఆ పోస్ట‌ర్ మీద రాసిన క్యాప్ష‌న్. ప‌క్క‌న బాల‌య్య మైకు ప‌ట్టి పాట పాడుతున్న‌ట్లుగా ఉన్న ఫొటో ఉంది. బాల‌య్య పాట పాడిన విష‌యాన్ని చెప్ప‌డానికి మ‌ధ్య‌లో నిన్న త‌ప్పు చేసిన వారిని నిల‌దీసింది ఆ గ‌ళం అన్న కామెంట్‌ను ఎందుకు తీసుకురావాల్సి వ‌చ్చిందో అర్థం కావ‌డం లేదు.

ఈ మ‌ధ్య బాల‌య్య తెలంగాణ ప్ర‌భుత్వంతో సినీ పెద్ద‌ల స‌మావేశానికి త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డంపై నిర‌స‌న గ‌ళం వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్ని ఇంట‌ర్వ్యూల్లోనూ కొంద‌రు సినీ పెద్దల మీద విమ‌ర్శ‌లు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఆర్థిక వ్య‌వ‌హారాల మీదా ప్ర‌శ్నించారు.

ఇప్పుడు పోస్ట‌ర్ మీద కామెంట్ చూస్తే ఆ విమ‌ర్శ‌ల్ని ఉద్దేశించి పెట్టిన‌ట్లుగా అనిపిస్తోంది. దీన్ని పీఆర్వోలంద‌రూ ఉమ్మ‌డిగా ప్ర‌మోట్ చేస్తుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. వివాదం కాస్త స‌ద్దుమ‌ణిగింద‌నుకుంటుండ‌గా.. మ‌ళ్లీ ఇలాంటి కామెంట్ల‌తో ర‌చ్చ అవ‌స‌ర‌మా అన్న‌ది ప్ర‌శ్న‌.