నాని హర్టయ్యాడా?

టాలీవుడ్లో ఏ అండా లేకుండా.. కేవలం ప్రతిభతో, తన కష్టంతో స్టార్‌గా ఎదిగిన అతి కొద్ది మంది నటుల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. చిన్న సినిమాలతో మొదలుపెట్టి అతను ఎదిగిన తీరు చూస్తే అందరికీ ముచ్చటేస్తుంది. మనలో ఒకడిలా అనిపించే నాని ఈ స్థాయిని అందుకోవడం గొప్ప విషయం. ఇందుకు అతను ఎప్పుడూ గర్వించాల్సిందే. ఐతే వారసుల మయం అయిపోయిన టాలీవుడ్లో నాని లాంటి వాళ్లకు అన్నిసార్లూ అనుకున్నంత సపోర్ట్ లభించదు. అందుకు కొన్ని నెలల కిందట ‘టక్ జగదీష్’ సినిమా విషయంలో జరిగిన రభసే నిదర్శనం. ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల ఎగ్జిబిటర్లు ఎంత తీవ్రంగా స్పందించారో.. నానికి ఎలా హెచ్చరికలు జారీ చేశారో తెలిసిందే.

ఐతే అదే ఎగ్జిబిటర్లు అగ్ర నిర్మాత సురేష్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నా సరే.. సురేష్ బాబు తన ప్రొడక్షన్లో తెరకెక్కిన మరో చిత్ం ‘దృశ్యం-2’ను సైతం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎగ్జిబిటర్ల నుంచి చప్పుడు లేదు. ఈ విషయంలో ఉన్న అసంతృప్తికి తోడు తన కొత్త చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ థియేట్రికల్ రిలీజ్‌కు ఎదురవుతున్న అడ్డంకులు చూసి మరింత హర్టవుతున్నట్లు సమాచారం. ‘పుష్ప’ మూవీ క్రిస్మస్‌కు రిలీజవుతుందని ప్రకటించడంతో అంతకంటే ముందు డిసెంబరు తొలి మూడు వారాల్లో ఏదో ఒకటి తన సినిమా కోసం ఎంచుకోవాలనుకున్నాడు నాని. ఐతే తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

తొలి మూడు వారాలకు వరుసగా అఖండ, గని, పుష్ప ఫిక్సయ్యాయి. తన రేంజికి మించి చాలా పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడంతో సోలో రిలీజ్ ఉండాలన్న ఉద్దేశంతో నాని డిసెంబరు 14కు ఫిక్సయ్యాడు. కానీ ఇప్పుడు ‘గని’ టీం డేట్ మార్చుకుని ‘శ్యామ్ సింగ రాయ్’కి పోటీగా తయారైంది. అలాగే ‘పుష్ప’ కోసం మేజర్ థియేటర్లు బుక్ చేయడం, రెండో వారానికి వాటిలో పెద్దగా కోత పడే అవకాశం లేకపోవడం, ‘గని’కి సైతం పెద్ద సంఖ్యలో థియేటర్లు బుక్ చేస్తుండటంతో నాని సినిమాకు ఇబ్బంది తప్పేలా లేదు. ఈ పరిణామాల పట్ల నాని చాలా ఆవేదనతో ఉన్నాడని.. ఎంతైనా వారసత్వ హీరోలకున్న సపోర్ట్ సొంతంగా ఎదిగిన వాళ్లకు ఉండదంటూ ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.