సేతుపతిని కొడితే క్యాష్ ప్రైజ్‌ ఇస్తారట

ఎవరి జోలికీ వెళ్లడు. అవసరాన్ని మించి మాట కూడా మాట్లాడడు. ఎవరైనా కష్టంలో ఉంటే పరిగెత్తుకు పోతాడు. సెలెబ్రిటీననే బిల్డప్ కూడా ఎక్కడా ఇవ్వడు. ఇలా విజయ్ సేతుపతి గురించి చాంతాడంత పొగడ్తలు వినిపిస్తారు తన గురించి తెలిసినవాళ్లు. అలాంటి వ్యక్తిపై సడెన్‌గా దాడి జరిగింది. అదింకా మర్చిపోకముందే సేతుపతిని ఎవరైనా కొడితే బహుమానాలు ఇస్తానని ఓ సంస్థ బహిరంగంగా ప్రకటించింది. అసలేం జరుగుతోంది? సేతుపతి చుట్టూ ఇంత వివాదం ఎందుకు నెలకొంది?

రీసెంట్‌గా బెంగళూరు ఎయిర్‌‌పోర్ట్‌లో విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దాన్ని సేతుపతి సీరియస్‌గా తీసుకోలేదు. కానీ హిందూ మక్కల్ కట్చి సంస్థ మాత్రం భలే బాగా జరిగింది అంటోంది. అతన్ని ఇంకా కొట్టాలని, ఎవరైనా అలా చేస్తే తన్నుకు 1001 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. స్వాతంత్ర్య సమరయోధుడైన దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్‌‌ని తను అవమానించాడని, అలాంటి వాడిని కొట్టినా తప్పు లేదని, సేతుపతి క్షమాపణ చెప్పేవరకు ఇలానే చేస్తామని ఆ సంస్థ ప్రతినిధి అర్జున్ సంపత్ అన్నారు.

దాంతో రీసెంట్‌గా జరిగిన దాడిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనెవరో తాగిన మత్తులో అలా చేశాడని సేతుపతి అన్నాడు. కానీ ఇప్పుడు ఈ ప్రకటన చూసిన తర్వాత కావాలనే సేతుపతిపై దాచి చేయించి ఉంటారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారంతా. అయితే అర్జున్ సంపత్ మాత్రం తాము అలాంటిదేం చేయించలేదు అంటున్నారు. చేస్తే మాత్రం కచ్చితంగా బహుమతి ఇస్తామని అంటున్నారు.

సేతుపతిపై దాడి చేసిన మహా గాంధీతో తాను మాట్లాడానని సంపత్ అంటున్నారు. నేషనల్ అవార్డ్ వచ్చిందుకు గాంధీ వెళ్లి విష్ చేయబోతే సేతుపతి వ్యంగ్యంగా మాట్లాడాడట. తేవర్ పూజకి రమ్మని ఆహ్వానిస్తే, ఈ లోకంలో తనకి తెలిసిన తేవర్ (దేవుడు) యేసుక్రీస్తు ఒక్కడేనని జవాబు చెప్పాడట. అందుకే అతనికి కోపమొచ్చి వాదనకు దిగాడని చెబుతున్నాడు. అయితే సేతుపతి గొడవలకు దిగే మనిషి కాదని, కావాలనే ప్లాన్ చేసి తనని బ్యాడ్ చేస్తున్నారని అతని సన్నిహితులు అంటున్నారు. మరి సేతుపతి ఏమంటాడో!