సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌ను ఎలా మార్చేస్తున్నారో చూడండి

తెలుగు రాష్ట్రాల్లోని ఫేమ‌స్ థియేట‌ర్ల‌లో హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ ఒక‌టి. మ‌హేష్ బాబు స‌హా చాలామంది స్టార్ హీరోలు ఆ థియేట‌ర్‌ను చాలా ప్ర‌త్యేకంగా చూస్తారు. త‌మ సినిమాల‌కు మెయిన్ థియేట‌ర్‌గా అదే ఉండాల‌ని కోరుకుంటారు. త‌మ సినిమాలు ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుండ‌గా అభిమానుల్ని క‌లిసేందుకు అక్క‌డికే వెళ్తారు.

ఆ థియేట‌ర్‌కు సంబంధించిన తాజా చిత్రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. లాక్ డౌన్ టైంలో ఆ థియేట‌ర్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. థియేట‌ర్ల‌లో సీటింగ్‌ను మార్చేస్తున్నారు.

ఒక సీట్ త‌ర్వాత ఇంకో సీట్ పీకి ప‌క్క‌న వేసేస్తున్నారు. ఇదంతా క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల చోటు చేసుకున్న మార్పే. ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌న్నీ మూత‌ప‌డి ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇంకో రెండు నెల‌ల పాటు థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశం లేదంటున్నారు. ఐతే మ‌ళ్లీ ఎప్పుడు థియేట‌ర్లు పునఃప్రారంభ‌మైనా కూడా.. కొన్ని నెల‌ల పాటు పూర్తి స్థాయిలో జ‌నాల్ని అనుమ‌తించ‌డం సందేహ‌మే. థియేట‌ర్లలో సీటింగ్ విష‌యంలో ష‌ర‌తులు పెట్టే అవ‌కాశ‌ముంది.

ఒక సీటు త‌ర్వాత ఇంకో సీటు విడిచిపెట్టి త‌ర్వాతి సీట్లో ప్రేక్ష‌కులు కూర్చోవాల్సి ఉండొచ్చంటున్నారు. ఐతే ఆ మేర‌కే నంబ‌ర్ల ప్ర‌కారం టికెట్లు అమ్మితే స‌రిపోతుంది కానీ.. సుద‌ర్శ‌న్ థియేట‌ర్ యాజ‌మాన్యం మాత్రం ఏకంగా హాల్లో స‌గం సీట్ల‌ను పీకేసింది.

థియేట‌ర్ పునఃప్రారంభం అయ్యాక‌ కొన్ని నెల‌ల పాటు ఇలాగే న‌డిపించి.. ఆంక్ష‌ల‌న్నీ ఎత్తేశాక మ‌ళ్లీ సీట్లు బిగించుకోవ‌చ్చ‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లున్నారు. ఇది ఖ‌ర్చు, శ్ర‌మ‌తో కూడుకున్న ప‌నే అయినా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌ప్ప‌దనుకున్న‌ట్లున్నారు.