‘టక్ జగదీష్’ ఓటీటీకి అమ్మేసినట్లే!

థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలనుకుంటున్న దర్శకనిర్మాతలకు ప్రస్తుతం పరిస్థితులు సహకరించడం లేదు. కరోనా మొదలైనప్పటి నుండి సినీ నిర్మాతలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. థియేటర్లు క్లోజ్ చేయడం, నైట్ కర్ఫ్యూ వలన సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయలేని పరిస్థితి. పైగా ఆంధ్రాలో టికెట్ రేట్ ఇష్యూ ఉండనే ఉంది. వీటన్నింటి వలన చాలా సినిమాలు ల్యాబ్ లోనే ఉండిపోయాయి.

ఈ లిస్ట్ లో నాని ‘టక్ జగదీష్’ సినిమా కూడా ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందులో నిజం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ లో కూడా నాని తన సినిమా థియేటర్లోనే వస్తుందంటూ పరోక్షంగా కామెంట్స్ చేశారు.

అయితే ఇప్పుడు ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీకి అమ్మేశారని సమాచారం. థియేటర్లు తెరుస్తారని, టికెట్ రేట్లు మారతాయని పరిస్థితులు నార్మల్ అవుతాయని భావించి నిర్మాతలు ఇన్నాళ్లూ ఎదురుచూశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫస్ట్ వేవ్ లో నాని నటించిన ‘వి’ ఓటీటీలోకి వచ్చింది. వెంటనే మరో సినిమా ఓటీటీ ఎందుకని నాని కూడా ఆగాడు. కానీ ఇప్పుడు నిర్మాతలపై ఆర్ధిక భారం పడడంతో నాని ఒప్పుకోక తప్పలేదు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటించింది.