కొత్త సినిమాలు.. టెన్షన్ టెన్షన్

పోయినేడాది కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఏడు నెలలకు పైగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. మార్చిలో షట్ డౌన్ అయ్యాక అక్టోబరులో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు లభించినా.. ఏపీ, తెలంగాణల్లో వెంటనే థియేటర్లు తెరుచుకోలేదు. డిసెంబర్లో తొలి వారంలో నెమ్మదిగా కొన్ని థియేటర్ల పున:ప్రారంభం కాగా.. క్రిస్మస్ సమయానికి పూర్తి స్థాయిలో అన్ని స్క్రీన్లూ అందుబాటులోకి వచ్చాయి. ఇండియాలో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా అంత కాలం పాటు థియేటర్లు మూతపడి ఉన్న చరిత్రే లేదు.

ఈ సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లు పున:ప్రారంభం కావడంతో అప్పుడు రిలీజైన సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ను విజయవంతం చేయడానికి అటు పరిశ్రమ జనాలు, ఇటు సామాన్య ప్రేక్షకులు కలసికట్టుగా కదిలారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వసూళ్ల పరంగా అది ‘హిట్’ స్టేటస్ అందుకుంది.

తర్వాత సంక్రాంతికి సందడి మరో స్థాయికి చేరింది. 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చాక తెలుగు రాష్ట్రాల థియేటర్లకు తిరుగులేదన్నట్లు తయారైంది. కానీ ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ రావడం.. ఏప్రిల్ నెలాఖరు నుంచి మళ్లీ థియేటర్లు మూతపడ్డం తెలిసిందే. రెండు నెలల షరతుల తర్వాత ఈ నెలలోనే థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు లభించాయి. వేరే సమస్యలు కొన్ని ఉండటంతో వెంటనే థియేటర్లను తెరవడానికి ఎగ్జిబిటర్లు తటపటాయించారు. ఎట్టకేలకు ఈ నెలాఖర్లో థియేటర్లను పున:ప్రారంభిస్తున్నారు. ఈ వారానికి తిమ్మరసు, ఇష్క్ లాంటి కాస్త పేరున్న చిత్రాలే విడుదలకు సిద్ధమయ్యాయి.

ఐతే గత ఏడాది ‘సోలో బ్రతుకే..’ తరహాలో వీటికి రౌజింగ్ వెల్కమ్ అయితే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో స్టార్లు లేరు. వాటికి పెద్ద ఫ్యామిలీల బ్యాకప్ లేదు. మరోవైపేమో ఏపీలో టికెట్ల రేట్లు, అదనపు షోల సమస్య ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అక్కడ థియేటర్లను పున:ప్రారంభించడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ఇచ్చేసి విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్న కొత్త చిత్రాల నిర్మాతల్లో టెన్షన్ తప్పట్లేదు. సందిగ్ధ పరిస్థితుల్లో తమ చిత్రాలను రిలీజ్ చేసి ఎక్కడ బలి అయిపోతామో అన్న భయం వారిలో కనిపిస్తోంది.