టెంప్ట్ అవుతున్న నిర్మాతలు.. ఆపుతున్న నాని?

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘టక్ జగదీష్’ షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ 23నే విడుదల కావాల్సింది. కానీ అంతకు కొన్ని రోజుల ముందే కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి థియేటర్లు మూతపడటంతో విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. లాక్ డౌన్ కొనసాగుతుండగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ టెంప్ట్ అవ్వలేదు. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ థియేటర్లలోనే తమ సినిమా విడుదల అవుతుందని నొక్కి వక్కాణిస్తూ వచ్చారు.

ఐతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ ఎత్తేశారు. థియేటర్లు పున:ప్రారంభం కాబోతున్నాయి. అయినా సరే.. ‘టక్ జగదీష్’ రిలీజ్ గురించి ఏ సమాచారం లేదు. థియేటర్లు పున:ప్రారంభం అయినా కూడా అవి అనుకున్నంత బాగా నడుస్తాయన్న అంచనాలు లేకపోవడంతో ‘టక్ జగదీష్’ సహా కొన్ని మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి రావడానికి సందేహిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో టికెట్ల ధరల సమస్య ఒక కొలిక్కి రావట్లేదు.

ఏప్రిల్లో ‘వకీల్ సాబ్’ రిలీజ్ సందర్భంగా ఉన్నట్లుండి ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లపై నియంత్రణ తీసుకొచ్చింది. చాలా ఏళ్ల కిందటి రేట్లను అమల్లోకి తెచ్చింది. పెద్ద సిటీలతో సమానంగా చిన్న టౌన్లలో థియేటర్లను రెనొవేట్ చేసి ఏసీలు, సౌండ్ సిస్టమ్స్ సమకూరిస్తే అక్కడ 20-30-40 రూపాయలతో టికెట్లు అమ్మి థియేటర్లను నడపడం ఎలా సాధ్యం అని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. ఎ, బి, సి అని సెంటర్ల తేడా లేకుండా కామన్ టికెట్ రేటు రూ.100 చేయాలని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ససేమిరా అంటోంది.

దీంతో ఏపీలో చాలా చోట్ల థియేటర్లు తెరవడానికి ఎగ్జిబిటర్లు వెనకడుగు వేస్తున్నారు. అదనపు షోలు, టికెట్ల రేట్లు పెంపు ఏపీలో సాధ్యమయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఇంత అననుకూల పరిస్థితుల్లో సినిమాలు ఎలా రిలీజ్ చేస్తామని కాస్త పేరున్న చిత్రాల నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు. ఈ టైంలోనే ‘టక్ జగదీష్’కు ఒక ప్రముఖ ఓటీటీ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు టెంప్ట్ అవుతున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే తన ‘వి’ సినిమా ఓటీటీలో వచ్చి దెబ్బ తినగా.. ఇప్పుడు మరో సినిమాను ఆ మార్గంలో రిలీజ్ చేస్తే తనను ‘ఓటీటీ స్టార్’ అనేస్తారేమో అన్న భయం నానీది. ‘టక్ జగదీష్’ పెద్ద హిట్టవుతుందన్న నమ్మకంతో ఉన్న అతను.. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడంపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి ‘టక్ జగదీష్’ భవితవ్యమేంటో చూడాలి.