మళ్లీ దర్శకుడిగా వెన్నెల కిషోర్?

Vennela Kishore

నటులు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. ఈ జాబితాలో ఎంతోమంది కనిపిస్తారు. కమెడియన్ వెన్నెల కిషోర్ సైతం ఒకప్పుడు దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నవాడే. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందాన్ని హీరోగా పెట్టి అతను ‘జఫ్ఫా’ అనే ఫన్నీ టైటిల్‌తో సినిమా తీశాడు.

అందులో కొన్ని సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి కానీ.. ఓవరాల్‌గా అది అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఆ తర్వాత తన డెబ్యూ మూవీ ‘వెన్నెల’కు సీక్వెల్‌గా ‘వెన్నెల 1.5’ అనే మరో సినిమా కూడా తీశాడు. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు.

రెండు చిత్రాలూ నిర్మాతలకు నష్టాలు మిగల్చడంతో ఇక చాలని మెగా ఫోన్ పక్కన పెట్టేశాడు. గత దశాబ్ద కాలంలో మళ్లీ దర్శకత్వం గురించి ఆలోచించలేదు. ఐతే ఒకసారి క్రియేటర్ అవతారం ఎత్తాక మళ్లీ అటు వైపు మనసు లాగకుండా ఎలా ఉంటుంది?

అందులోనూ కిషోర్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ నటిస్తూనే సినిమాల మేకింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు మరి. ఈ నేపథ్యంలో కిషోర్ మళ్లీ దర్శకత్వం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఐతే ఈసారి సినిమా తీసే రిస్క్ చేయట్లేదట కిషోర్. ప్రస్తుతం ఓటీటీల విప్లవం నడుస్తున్న నేపథ్యంలో ఓటీటీ కోసం ఒక సినిమానో సిరీసో తీసే ప్రయత్నంలో ఉన్నాడట ఈ స్టార్ కమెడియన్.

‘ఆహా’ యువ దర్శకులను బాగా ప్రోత్సహిస్తూ వరుసగా వెబ్ ఫిలిమ్స్, సిరీస్‌లు తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఓటీటీ కోసమే కిషోర్ కూడా ఒక స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని.. పరిమిత బడ్జెట్లో, కొత్త నటీనటులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కిషోర్ చూస్తున్నాడని వార్తలొస్తున్నాయి.

ఇందులో కిషోర్ కూడా కీలక పాత్ర చేస్తాడని అంటున్నారు. మంచి కామెడీ టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న కిషోర్ తనకు పట్టున్న కామెడీ జానర్లో కొంచెం జాగ్రత్తగా సినిమానో సిరీసో తీస్తే మంచి ఫలితమే రావచ్చు.