‘రామాయణ్’ను బీబీసీ వాళ్లు కొనాలనుకున్నారా?

భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించి.. అత్యధికంగా ఆదరణ పొందిన సీరియల్స్ ఏవి అంటే మరో మాట లేకుండా రామాయణ్, మహాభారత్ అని చెప్పొచ్చు. 80, 90 దశకాల మధ్య ఈ సీరియల్స్ రెండూ భారతీయ టీవీ ప్రేక్షకులనూ ఉర్రూతలూగించాయి. ఆ సీరియల్స్ వస్తే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ప్రేక్షకులు.

ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంలో డీడీలో ఈ రెండు సీరియళ్లను పున:ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వాటికి ఆదరణ దక్కలేదని వ్యూయర్ షిప్ చూస్తే అర్థమవుతుంది.

ఇంత ఆదరణ సంపాదించుకున్న సీరియల్స్‌లో ఒకటైన ‘రామాయణ్’ను బీబీసీ వాళ్లు సైతం ప్రసారం చేయాలనుకున్నారట. ఆసియాలో తమ ఛానెల్‌కు ఆదరణ పెంచుకోవడం కోసం వాళ్ల కళ్లు ‘రామాయణ్’ మీదే పడ్డాయట. ఇందుకోసం దీని దర్శకుడు రామానంద్ సాగర్‌తో సంప్రదింపులు కూడా జరిపారట.

మూడు దశాబ్దాల కిందట బీబీసీ వాళ్లు తన తండ్రితో ‘రామాయణ్’ హక్కుల కోసం సంప్రదింపులు జరిపిన విషయాన్ని రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్ సాగర్ తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు.

సీరియల్ హక్కుల కోసం సంప్రదింపులు జరిపేందుకు తమ స్టూడియోకే బీబీసీ వాళ్లు పిలిచారని.. దానికి తాను, తన తండ్రి, రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్, రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కలిసి వెళ్లామని.. ఐతే రాముడి వేషంలో ఉన్న అరుణ్‌ను తమ స్టూడియో అంతటా నడవాలని, దాన్ని షూట్ చేసుకుంటామని బీబీసీ వాళ్లు అడిగారని.. మన వాళ్లు దైవంలా చూసే రాముడిని వాళ్లు ఏ దృష్టితో చూస్తున్నారో అర్థమైందని.. ఈ సీరియల్ తాలూకు భావోద్వేగాలను వారు అర్థం చేసుకోలేదని.. దీంతో రామానంద్ సాగర్‌కు కోపం వచ్చి వాళ్లతో డీల్‌కు అంగీకరించకుండా వచ్చేశారని ప్రేమ్ సాగర్ తెలిపాడు.