బాలీవుడ్లో ఒక మెగా డాక్యుమెంటరీ

ఒక షోలే.. ఒక జంజీర్.. ఒక దీవార్.. ఒక క్రాంతి.. ఒక సీతా ఔర్ గీత.. ఈ సినిమాల పేర్లు చెబితే పాత తరం హిందీ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 70, 80 దశకాల్లో భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలివి. బ్లాక్‌బస్టర్ అనే పదానికి అప్పట్లో అసలైన అర్థం చెప్పిన చిత్రాలివి. వీటి సృష్టికర్తలు.. సలీమ్ ఖాన్-జావెద్ అక్తర్. ఇండియన్ సినిమాలో రచయితలకు స్టార్ స్టేటస్ రావడం.. రచయితల పేర్లు చూసి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టడం వీరితోనే మొదలైంది. ముఖ్యంగా ‘షోలే’ సినిమాతో వీరికొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి 24 చిత్రాలకు పని చేయడం విశేషం.

ఆ సినిమాలతో బాలీవుడ్లో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఈ ఇద్దరు రచయితల మీద ఇప్పుడు ఒక మెగా డాక్యుమెంటరీ రాబోతోంది. వారి గొప్పదనాన్ని తర్వాతి తరాలకు తెలియజేసే ప్రయత్నాన్ని వారి పిల్లలు చేస్తుండటం విశేషం.

సలీమ్ ఖాన్ తనయుడు సల్మాన్ ఖాన్.. జావెద్ అక్తర్ పిల్లలు ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ తమ సొంత నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో సలీమ్, జావెద్‌ల మీద డాక్యుమెంటరీ తీయబోతున్నట్లు ప్రకటించారు. జోయా సన్నిహితురాలు, దర్శకురాలైన రీమా కగ్తి కూడా వీరికి తోడవుతోంది. ‘ది యాంగ్రీ యంగ్‌మెన్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కనుంది. నమ్రతా రావు దీనికి దర్శకత్వం వహించనున్నారు.

అమితాబ్‌కు సూపర్ స్టార్ ఇమేజ్‌తో పాటు ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనే ట్యాగ్ లైన్ రావడానికి సలీమ్-జావెద్‌లే కారణం. వారి సినిమాలు షోలే, జంజీర్, దీవార్‌లతోనే ఆయన ఎదిగారు. ఇప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ టైటిల్ వీళ్లకే పెట్టి భారీ స్థాయిలో డాక్యుమెంటరీ తీయడానికి వారి పిల్లలు ముందుకు రావడం విశేషం. రాజీ లేకుండా భారీ బడ్జెట్లో వీరి విజయ గాథను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు సల్మాన్, ఫర్హాన్, జోయా.