యూవీ క్రియేషన్స్ ప్లానింగ్ అదుర్స్!

టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాను తెరకెక్కిస్తోంది. ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూనే ఇప్పుడు చిన్న సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాను నిర్మించింది. అమెజాన్ లో విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. కేవలం రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమాను అమెజాన్ సంస్థ ఏకంగా తొమ్మిది కోట్లు పెట్టి కొనుక్కుంది.

దానికి కారణం యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్రాండ్ వాల్యూ అనే చెప్పాలి. చిన్న సినిమాల్లో ఇంత లాభం ఉందని గ్రహించిన ఈ సంస్థ ఇప్పుడు అదే తరహాలో మరిన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతోంది. ‘ఏక్ మినీ కథ’కు స్టోరీ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో మరో కథ రెడీ చేయించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. అది కూడా ఓ బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా అని తెలుస్తోంది. ఇది కాకుండా మారుతితో సైలెంట్ గా మరో సినిమా మొదలుపెట్టింది.

ఇందులో కూడా సంతోష్ శోభన్ నే హీరోగా తీసుకున్నారు. నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా రెండు కోట్ల లోపే అని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తవ్వక ముందే బేరం కుదిరిపోయిందట. ‘ఆహా’ సంస్థ ఎక్కువ మొత్తం చెల్లించి ఈ సినిమా రైట్స్ ను తీసుకుందట. దాదాపు అనుకున్న బడ్జెట్ కి మూడు రెట్లు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో లాభాలు రావడం విశేషమనే చెప్పాలి. భవిష్యత్తులో యూవీ సంస్థ మరిన్ని చిన్న సినిమాలను రావడం ఖాయం!