నిర్మాతలను టెంప్ట్ చేస్తోన్న ఓటీటీ ఆఫర్లు!

కరోనా కాలంగా థియేటర్లు తెరవకపోవడంతో చాలా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన ‘రాధె’ సినిమాను సైతం ఒకేసారి ఓటీటీలో, అందుబాటులో ఉన్న థియేటర్లలో విడుదల చేశారు. ఒకప్పుడు చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో మీడియం, స్టార్ హీరోల సినిమాలపై దృష్టి పెడుతున్నాయి.

నాని నటించిన ‘టక్ జగదీష్’, విశ్వక్ సేన్ ‘పాగల్’, రవితేజ ‘ఖిలాడి’ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా మంచి రేట్ ఆఫర్ చేశాయి. కానీ ఈ సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. హీరోలెవరూ కూడా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి అంగీకరించడం లేదు. తమ సినిమాలు ముందుగా థియేటర్లోనే విడుదల కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. మరోపక్క నిర్మాతలకు ఓటీటీ సంస్థల నుండి ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి పేరున్న ఓటీటీ సంస్థలు దర్శకనిర్మాతలతో మంతనాలు జరుపుతున్నాయి. ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న డీల్ చాలా టెంప్టింగ్ గా ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. హీరోలు డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకోకపోవడమే దానికి కారణమని తెలుస్తోంది. వారిని ఎదిరించి ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకునే ధైర్యం లేక నిర్మాతలు సైలెంట్ గా ఊరుకుంటున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు తెరుచుకున్నా యాభై శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తారు. జనాలు ఎంతవరకు థియేటర్లకు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఇన్ని సందేహాల నడుమ ఓటీటీకి సినిమాను అమ్మితే లాభాలైనా వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారట. మరేం జరుగుతుందో చూడాలి!