ఆ సినిమా ఎట్టకేలకు రిలీజ్..

21 ఏళ్ల వయసులోనే ‘ధ్రువంగల్ పదినారు’ అనే వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమా తీసి కోలీవుడ్లో ెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు కార్తీక్ నరేన్. ఈ చిత్రం తెలుగులో ’16’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి ఫలితాన్నందుకుంది. కార్తీక్‌ టాలెంట్‌కు ఫిదా అయిపోయి అతడి రెండో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు అగ్ర దర్శకుడు గౌతమ్ మీనన్. కానీ ఈ ప్రోత్సాహమే కార్తీక్‌కు శాపంగా మారింది. సినిమా పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. అందుక్కారణం గౌతమ్ మీనన్‌కు ఉన్న ఆర్థిక వివాదాలు. మూడేళ్లకు పైగా ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. కార్తీక్ మూడో సినిమా ‘మాఫియా’ కూడా రిలీజ్ కాగా.. దీనికి మాత్రం మోక్షం కలగలేదు.

ఇక ఎప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోదేమో అనుకున్నారంతా. ఐతే తన వల్ల ఇలాగే ఆగిపోయిన ధనుష్ సినిమా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ను రెండేళ్ల కిందట అతి కష్టం మీద రిలీజ్ చేసిన గౌతమ్.. ఎట్టకేలకు ‘నరకాసురన్’ను కూడా బయటికి తేవడానికి రంగం సిద్ధం చేసినట్లున్నాడు. ‘నరకాసురన్’ను విడుదల చేయడానికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా.. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసినట్లు తెలుస్లోంది. ‘సోనీ లైవ్’ ద్వారా ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట. కార్తీక్ తొలి చిత్రం ‘ధ్రువంగల్ పదినారు’కు కొనసాగింపుగానే ‘నరకాసురన్’ తీశాడు కార్తీక్.

ఈ చిత్రంలో మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తోె పాటు శ్రియ, అరవింద్ స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ నటించిన మరో తమిళ చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానుండటం విశేషం. ఆ సినిమా పేరు.. కసాడ తపర. ఇదొక ఆంథాలజీ ఫిలిం. సందీప్‌తో పాటు హరీష్ కళ్యాణ్, రెజీనా కసాండ్రా, దర్శకుడు వెంకట్ ప్రభు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సోనీ లైవ్‌లోనే జులైలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.