కాజల్.. ‘సీత’ తర్వాత ఇంకోటి


దాదాపు దశాబ్దంన్నర నుంచి కథానాయికగా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఇటు తెలుగు, అటు తమిళంలో పెద్ద హీరోలు చాలామందితో జట్టు కట్టిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే మిగతా స్టార్ హీరోయిన్లతో పోలిస్తే ఆమె పెద్దగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయలేదు. పుష్కరానికి పైగా కథానాయికగా కొనసాగాక.. రెండేళ్ల కిందట ‘సీత’ చిత్రంలో నటించింది. అదే ఆమె తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ దెబ్బతో మళ్లీ ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయదనే అనుకున్నారు.

ఐతే ఇటీవల ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్‌లో ఆమె లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చందమామ మళ్లీ ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నట్లు సమాచారం. ‘లైవ్ టెలికాస్ట్’ తరహాలోనే హార్రర్ జానర్లో ఈ సినిమా ఉండబోతోందట.

సంపత్ నంది నిర్మాణంలో సంతోష్ శోభన్ హీరోగా ‘పేపర్ బాయ్’ అనే సినిమా తీసిన జయశంకర్.. కాజల్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయనున్నాడట. ‘పేపర్ బాయ్’ నిరాశపరిచినప్పటికీ.. ఇటీవల ఒక ఓటీటీలో వచ్చిన ‘విటమిన్-షీ’ షోతో జయశంకర్ ఆకట్టుకున్నాడు. దీని తర్వాత అతను ఒక డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ కథను రెడీ చేసి కాజల్‌కు వినిపించి ఆమె నుంచి కమిట్మెంట్ తీసుకున్నాడట. ఈ చిత్రానికి నిర్మాత కూడా సెట్ అయ్యాడని, లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని.. జూన్ 19న కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించనున్నారని తెలిసింది.

ప్రస్తుతం తెలుగులో ‘ఆచార్య’, తమిళంలో ‘ఇండియన్-2’ లాంటి భారీ ప్రాజెక్టులు కాజల్ చేతిలో ఉన్నాయి. అలాగే నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు రూపొందించినున్న సినిమాకు కూడా కాజల్ సంతకం చేసింది. పెళ్లి తర్వాత ఆమె కెరీర్ ఇంత ఊపులో ఉండటం విశేషమే.