ఓటీటీలపై ఏడుపు.. థియేటర్ల దోపిడీ మాటేంటి?

లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సినిమాల థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం కనిపించడం లేదు. ఎప్పుడు పరిస్థితులు బాగుపడతాయో అర్థం కాక.. తక్కువ బడ్జెట్లో నిర్మించిన సినిమాల్ని కొంత మేర లాభానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమ్మే పనిలో పడ్డారు నిర్మాతలు.

హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా లాంటి ప్రముఖ నటులు కలిసి నటించిన ‘గులాబో సితాబో’ లాంటి పేరున్న సినిమాను అమేజాన్ ప్రైంలో వచ్చే నెల 12న నేరుగా రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించడం థియేటర్ల యాజమాన్యాల్ని కలవరపాటుకు గురి చేసింది. ఐనాక్స్ థియేట్రికల్ ఛైన్ ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. మిగతా థియేట్రికల్ చైన్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మీద తమ అసహనాన్ని చూపిస్తున్నాయి.

కానీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ చాలా తక్కువ ఖర్చుతో కొత్త సినిమాలు అందిస్తున్నాయి. వాటిలో బోలెడంత కంటెంట్ ఉంటోంది. అమేజాన్ ప్రైమ్ సంగతే తీసుకుంటే ఏడాదికి వెయ్యి రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఖర్చుతో ఆ సంస్థ బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందిస్తోంది. ఒక మల్టీప్లెక్సులో కుటుంబంతో కలిసి ఒక పెద్ద సినిమా చూడటానికి కూడా ఈ వెయ్యి రూపాయలు సరిపోవడం లేదు.

మామూలుగానే మల్టీప్లెక్సుల్లో 150 నుంచి 250 వరకు టికెట్ రేటు ఉంటోంది. ఇక భారీ సినిమాలు రిలీజైతే రెండు వారాల పాటు రేట్లు పెంచుతున్నారు. సంక్రాంతికి రిలీజైన రెండు భారీ చిత్రాలకు రేట్లు ఎలా పెంచేశారో తెలిసిందే. రెండు మూడు వారాల పాటు ఇదే పరిస్థితి.

ఇక మల్టీప్లెక్సుకెళ్లి ఒక వాటర్ బాటిల్ కొనాలాంటే 40-50 రూపాయలు పెట్టాలి. ఒక పాప్ కార్న్ డబ్బాకు రూ.150 నుంచి 200 వసూలు చేస్తారు. కూల్ డ్రింక్‌కు 90 రూపాయలు బాదుతారు. కుటుంబంతో వెళ్లినపుడు పిల్లలకు ఏమీ తీసివ్వకుండా ఉండలేం. కొంటే జేబు గుల్లవుతుంది. అక్కడికెళ్లి రేటు అడిగి అంతా అంటే అదోలా చూస్తారు. రేట్లు ఎక్కువున్నాయేంటి అని అడిగితే అవమానించేలా మాట్లాడతారు.

అప్పుడప్పుడూ ప్రభుత్వాలు మల్టీప్లెక్సులపై కొరఢా ఝులిపించినట్లు కనిపిస్తాయి. తర్వాత మళ్లీ మామూలే. అడిగేవాళ్లుండరు. సినిమా చూద్దామని థియేటర్లకు వచ్చే జనాల్ని ఇలా బాదేసే మల్టీప్లెక్సులు.. ఇప్పుడేమో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలు ఓటీటీల్లో డైరెక్టుగా సినిమాలు రిలీజ్ చేస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడమేంటో?