చిరు సినిమా వదులుకోలేదు.. పవన్ సినిమాయే చేస్తాను

రవితేజకు ‘మిరపకాయ’లాంటి హిట్టు ఇచ్చిన హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ‘గబ్బర్ సింగ్’లాంటి మాస్ మసాలా ఎనర్జీని అందించాడు. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్‌‌తో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, అల్లు అర్జున్‌తో ‘డీజే’, వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేశ్’ చిత్రాలు తీసి, మెగా కాంపౌండ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు కూడా. అలాంటి హరీశ్ శంకర్‌కు మెగాస్టార్‌‌ను డైరెక్ట్ చేసే సువర్ణ అవకాశం వస్తే, కాదన్నాడని వార్తలు వచ్చాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీటిపై క్లారిటీ ఇచ్చాడు హరీశ్ శంకర్. కొన్నాళ్ల కింద మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్‌లో చిరూను డైరెక్ట్ చేసే అవకాశం హరీశ్ శంకర్‌కు వచ్చిందని, కాని ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ ఈ ఆఫర్‌కు నో చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, కొన్ని వెబ్‌సైట్లు సృష్టించిన రూమర్ ఇదని తేల్చేసిన హరీశ్ శంకర్, మెగాస్టార్‌ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే చచ్చినా వదులుకోనని చెప్పాడు. #PSPK28 సినిమాను కన్ఫార్మ్ చేసిన హరీశ్ శంకర్, అప్పటిదాకా మరే సినిమా చేయనని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ చేస్తున్న పవన్, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పిరియాడిక్ మూవీని పూర్తిచేయాల్సి ఉంది. ఈ రెండూ ముగిసిన తర్వాతే హరీశ్ శంకర్‌తో సినిమా మొదలవుతుంది. అయితే తన ‘గబ్బర్ సింగ్’ కోసం రెండేళ్లైనా వెయిట్ చేస్తానంటున్నాడు హరీశ్ శంకర్. అయితే ఈలోపు సినిమాలేవీ మొదలెట్టకపోయినా వెబ్ సిరీస్‌లు మాత్రం చేస్తాడట. ప్రస్తుతం పవన్‌ సినిమా స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో ఉన్నానని, ఇదయ్యాక వెబ్ సిరీస్‌ సంగతి ఆలోచిస్తానని అంటున్నాడు హరీశ్ శంకర్.