పవన్‌‌కు జోడీగా ఆమె ఫిక్స్?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి హీరోయిన్లు ఎగబడటం కామన్. కానీ ఆయనతో సినిమా ఓకే అయ్యాక అందులో నటించలేనంటూ ఓ హీరోయిన్ తప్పుకోవడం ఈ మధ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కథానాయిక మరెవరో కాదు.. సాయిపల్లవి. అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌లో పవన్‌కు జోడీగా ముందు సాయిపల్లవి ఎంపిక కావడం, కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె తప్పుకోవడం తెలిసిన సంగతే.

మలయాళంలో గౌరి నంద అనే అమ్మాయి చేసిన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. గిరిజనురాలైన నక్సలైట్ పాత్ర తనది. ఇళాంటి పాత్రను ఎవరు పడితే వాళ్లు చేయలేరు. మంచి నటి అయి ఉండాలి. నిడివి తక్కువే అయినా పేరున్న నటినే ఈ పాత్ర కోసం తీసుకోవాల్సి ఉండటంతో ఆర్టిస్టును ఖరారు చేయడంలో ఆలస్యం జరిగింది. ఐతే ఎట్టకేలకు ఆ పని పూర్తయినట్లు సమాచారం.

సాయిపల్లవి కంటే ముందు తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన మరో మలయాళ నటి నిత్యా మీనన్‌ను ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో పవన్‌కు జోడీగా ఖాయం చేసినట్లు తాజా సమాచారం. పాత్ర నచ్చి ఇందులో నటించడానికి నిత్య ఓకే చెప్పిందట. ఆమె ఈ పాత్రకు మంచి ఛాయిస్ అనే అంటున్నారు. పవన్‌కు కరోనా సోకడం, వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉండటంతో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ షూటింగ్‌ను కొన్ని వారాల నుంచి ఆపేసి ఉన్నారు.

పవన్‌తో దగ్గరగా మెలిగిన దర్శకుడు సాగర్ చంద్ర ఐసొలేట్ కావడం తెలిసిందే. మళ్లీ ఎప్పుడు అందరికీ కుదిరితే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. మధ్యలో దొరికిన ఖాళీలోనే నిత్యా మీనన్‌ను ముఖ్య పాత్ర కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది