చిరంజీవి కథ.. రవితేజ చేస్తాడా ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లెక్కే వేరు. తన కథపై పూర్తి క్లారిటీతో ఉంటాడు. అందుకే వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి క్వాలిటీ అవుట్ పుట్ తీసుకువస్తాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ ‘లైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరో. తన తదుపరి చిత్రం ఏంటో పూరి ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ కోసం ముందుగా ఎంపిక చేసుకుంది పూరి జగన్నాధ్ నే. పూరి చాలా సంతోషంతో మెగాస్టార్ కోసం మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ‘ఆటో జానీ’ కథ సిద్ధం చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో చిరు ఈ కథని రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ మిస్ కావడంతో పూరి బాగా నిరాశపడ్డాడు. ఆటో జానీ కథ అలాగే ఉండిపోయింది. 

ఆటో జానీ కథని మరో హీరోతో తెరకెక్కించేందుకు పూరి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. మాస్ మహారాజ్ రవితేజ. రవితేజకు కూడా ఈ కథ బాగా సెట్ అవుతుందని.. కొంచెం మార్పులు చేస్తే సరిపోతుందని పూరి భావిస్తున్నాడట. లైగర్ పూర్తయ్యాక ఆటో జానీపై పూరి ఫోకస్ పెట్టనున్నట్లు టాక్. 

పూరి అడిగితే రవితేజ కాదనడం అంటూ ఉండదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు ఇలా ఐదు చిత్రాలు వచ్చాయి.