చాన్నాళ్లకు కొత్త దర్శకుడితో మాస్ రాజా

తెలుగులో స్టార్ హీరోలు కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేయడం అరుదు. ఒకవేళ చేసినా కూడా ప్రయోగాల జోలికి వెళ్లరు. సేఫ్‌గా పక్కా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటారు. మాస్ రాజా రవితేజ ఇదే టైపు. ఆయన కొత్త, ఎక్కువ అనుభవం లేని దర్శకులను బాగానే ప్రోత్సహిస్తుంటాడు. కాకపోతే వాళ్లతో కొత్త తరహా సినిమాలు మాత్రం ట్రై చేయడు. పక్కా మాస్ కథ తీసుకొస్తే దర్శకుడి పనితనం తగ్గినా.. తన ఎనర్జీతో సినిమాను కాపాడేయొచ్చని ధీమా కావచ్చు.

గత దశాబ్ద కాలంలో రవితేజ ఇద్దరు కొత్త దర్శకులతో పని చేశాడు. అందులో ఒకరు గోపీచంద్ మలినేని కాగా.. ఇంకొకరు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ. రవితేజతో వీళ్లిద్దరి తొలి సినిమాలు డాన్ శీను, పవర్ పక్కా మాస్ మసాలా సినిమాలే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మాస్ రాజా మరోసారి కొత్త దర్శకుడితో పని చేయబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు.. శరత్ మండవ.

ఈ కొత్త దర్శకుడు చెప్పిన ఓ కథకు రవితేజ ఓకే చెప్పినట్లు సమాచారం. ‘క్రాక్’ తరహాలోనే ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ అట. కొన్నేళ్ల కిందట ఆంధ్రా ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ‘పడి పడి లేచె మనసు’తో చేదు అనుభవం ఎదుర్కొన్నప్పటికీ నిరాశ చెందకుండా ‘విరాటపర్వం’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ లాంటి ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టిన యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి.. రవితేజ-శరత్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అది కూడా పూర్తయ్యాక శరత్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ‘ఖిలాడి’ మే 28న విడుదల కావాల్సి ఉండగా.. త్రినాథరావు నక్కిన సినిమా కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి.