నాని సరదాగా అంటే అదే నిజమైంది

ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ‘జెంటిల్‌మేన్’ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న హీరో పాత్ర చేశాడు నేచురల్ స్టార్ నాని. దానికి మంచి స్పందనే వచ్చింది. సినిమా కూడా మంచి విజయాన్నందుకుంది. ఇప్పుడతను ఏకంగా పూర్తి స్థాయి విలన్ పాత్రే చేసేశాడు. అది కూడా ఇంద్రగంటి సినిమాలోనే. ఆ చిత్రమే.. వి. సుధీర్ బాబు ఇందులో కథానాయకుడు.

ఐతే సుధీర్ బాబు హీరోగా చేసే సినిమాలో తాను విలన్ పాత్ర చేస్తానని కొన్నేళ్ల కిందటే నాని ట్విట్టర్లో చెప్పడం విశేషం. అప్పుడతను సరదాగా అన్నాడో ఏమో కానీ.. ఆ మాటే నిజం కావడం ఆశ్చర్యం అంటున్నాడు సుధీర్ బాబు. తాను హిందీ చిత్రం ‘బాగి’లో విలన్ పాత్ర చేసినందుకు నాని తనను అభినందిస్తూ.. భవిష్యత్తులో నువ్వు హీరోగా చేస్తే నేను విలన్ పాత్ర పోషిస్తా అంటూ ట్విట్టర్లో కామెంట్ చేశాడని.. తథాస్తు దేవతలేమైనా దీవించారో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు ఆ విషయమే నిజమైందని అన్నాడు సుధీర్.

తాను ఇంద్రగంటి డైరెక్షన్లో ‘సమ్మోహనం’ చేస్తున్నపుడే ఆయన ‘వి’ కథను తనకు చెప్పాడని.. ఇంతకీ ఆ సినిమాకు ప్రధాన పాత్రలకు ఎవరిని అనుకుంటున్నారని అడిగితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అయితే బాగుంటుందని చెప్పారని.. నిజంగా వాళ్లిద్దరూ ఈ సినిమా చేస్తే భలేగా ఉండేదని చెప్పాడు సుధీర్.

ఐతే పవన్, మహేష్‌లను ఇంద్రగంటి సంప్రదించాడో లేదో కానీ.. కొన్నాళ్లకు తాను ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఇంద్రగంటి చెప్పాడని అన్నాడు సుధీర్. తాను ఏ పాత్ర చేస్తే బాగుంటుందని అనుకున్నానో ఆ పాత్రనే తనకు మోహనకృష్ణ ఆఫర్ చేయడంతో చాలా సంతోషించానని చెప్పాడు సుధీర్.

కరోనా భయం నేపథ్యంలో తమ చిత్రాన్ని వాయిదా వేయాలని ముందే నిర్ణయించుకోవడం మంచిదే అయిందని.. ఒకవేళ సినిమా రిలీజైన కొన్ని రోజులకు లాక్ డౌన్ అమలై ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని.. ఇప్పుడు తమ సినిమాకు ఉచిత ప్రచారం లభిస్తోందని.. పరిస్థితులు చక్కబడ్డాక తమ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని చెప్పాడు సుధీర్.