‘రౌడీ బేబీ’ టైటిల్‌ను ఇలా మార్చేశారు


టాలీవుడ్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుపోయే హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అతడికి అవకాశాలు వరుస కడుతుంటాయి. చివరగా సందీప్ నుంచి వచ్చిన ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. అయినా అతనేమీ ఆగట్లేదు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మొదలుపెట్టిన సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రానికి ముందు ‘రౌడీ బేబీ’ అనే ఆకర్షణీయమైన టైటిల్ పెట్టుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరే నిర్మాత రిజిస్టర్ చేయించడంతో పేరు మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. తమ సినిమా పేరు మారనున్నట్లు అధికారికంగానే ప్రకటించిన చిత్ర బృందం.. ఈ రోజు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా కొత్త టైటిల్ లాంచ్ చేయించారు.

‘రౌడీ బేబీ’లోంచి బేబీ తీసేసి.. గల్లీ పదాన్ని చేర్చి ‘గల్లీ రౌడీ’ అనే పేరు ఖరారు చేశారు ఈ చిత్రానికి. మారింది పేరు మాత్రమే అని, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ కొత్త టైటిల్‌తో ఒక వీడియోను వదిలారు. ‘రౌడీ బేబీ’ అంత పాపులర్ కాకపోయినా ‘గల్లీ రౌడీ’ అనే టైటిల్ కూడా ఆకర్షణీయమైంది. టైటిల్‌ను బట్టి సందీప్ ఇందులో ఒక ఛోటా రౌడీ పాత్రలో కనిపించనున్నాడని అర్థమవుతోంది. కోన వెంకట్ సమర్పణలో వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.

ఈ చిత్రంలో సందీప్ సరసన ‘మెహబూబా’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు బాబీ సింహా ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇంతకుముందు సందీప్-నాగేశ్వరరెడ్డి కలయికలో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ నిరాశ పరిచింది. మరి ‘గల్లీ రౌడీ’తో అయినా ఈ ఇద్దరూ హిట్ కొడతారేమో చూడాలి.