మోస‌గాళ్లు ర‌చ‌యిత‌లు ఎవ‌రు?

మంచు విష్ణు నుంచి కొంత విరామం త‌ర్వాత వ‌స్తున్న సినిమా మోస‌గాళ్ళు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఇండియ‌న్ కాదు. హాలీవుడ్ నుంచి జెఫ్రీ చిన్ అనే ద‌ర్శ‌కుడిని తీసుకొచ్చాడు విష్ణు. అత‌ను ఇంత‌కుముందు ఒక షార్ట్ ఫిలిం మాత్ర‌మే డైరెక్ట్ చేశాడు. ఫీచ‌ర్ ఫిలిం తీసిన అనుభ‌వ‌మేమీ లేదు. ఇక ఈ సినిమా క‌థ అంతా ఇండియా నేప‌థ్యంలో న‌డిచేది. ఇక్క‌డి విష‌యాల‌పై ద‌ర్శ‌కుడికేమీ అవ‌గాహ‌న లేన‌ట్లే. స్క్రిప్టులో కూడా అత‌ను భాగం కాదు. స్క్రిప్టు చేతికిస్తే దాన్ని డైరెక్ట్ చేసి పెట్టాడు.

మ‌రి ఈ చిత్రానికి స్క్రిప్టు రాసింది ఎవ‌రు అన్న సందేహం రావ‌డం స‌హ‌జం. ఆ బాధ్య‌త స్వ‌యంగా మంచు విష్ణునే తీసుకున్నాడు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఐటీ స్కాం గురించి తెలుసుకున్న అత‌ను.. దానిపై స్వ‌యంగా స్క్రిప్టు రాశాడ‌ట‌. ఫ‌స్ట్ డ్రాఫ్ట్ అయ్యాక మంచు కుటుంబానికి సన్నిహితుడైన‌ డైమండ్ ర‌త్న‌బాబు స‌హ‌కారం తీసుకున్నాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి మోస‌గాళ్ళు స్క్రిప్టును ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దారు. త‌ర్వాత ఇంగ్లిష్‌లో దీనికి డ్రాఫ్ట్ త‌యారు చేయించారు. ఆపై స్క్రిప్టును ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టారు.

విష్ణు ఇంత‌కుముందు కూడా దేనికైనా రెడీ స‌హా త‌న సినిమాలు కొన్నింట్లో క‌థా చ‌ర్చ‌ల్లో కీల‌కంగా ఉన్నాడు. కానీ తొలిసారి ర‌చ‌యిత‌గా అత‌డి పేరు మోస‌గాళ్ళు సినిమాకే ప‌డ‌నుంది. అంటే త‌న కెరీర్‌ను గాడిన పెట్టుకోవ‌డానికి స్వ‌యంగా విష్ణునే ర‌చ‌యిత‌గా మారాడ‌న్న‌మాట‌. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఏమేర ఫ‌లితాన్నందిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో కాజ‌ల్‌.. విష్ణుకు సోద‌రిగా న‌టించ‌డం విశేషం. సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ నెల 19న మోస‌గాళ్ళు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.