కోలీవుడ్లోకి పూజా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ

ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే.. మన ప్రేక్షకులు తడుముకోకుండా పూజా హెగ్డే పేరు చెప్పేస్తారు. ఇప్పటికే మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాల్లో బడా స్టార్లతో నటించిన పూజా.. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సహా మరికొన్ని పెద్ద చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఏ పెద్ద సినిమా పట్టాలెక్కినా.. కథానాయిక పాత్ర కోసం పూజా వైపే చూసే పరిస్థితి ఉంది. ఆమెకు హిందీలో సైతం మంచి డిమాండే ఉంది. అక్కడా రెండు మూడు భారీ చిత్రాల్లో నటిస్తోంది.

ఇక ఇండియాలో బాలీవుడ్, టాలీవుడ్ తర్వాత అతి పెద్ద ఇండస్ట్రీ.. హీరోయిన్లు తప్పక నటించాలని కోరుకునే పరిశ్రమ అంటే.. కోలీవుడ్డే. అక్కడ కూడా త్వరలోనే తన హవా మొదలుపెట్టడానికి పూజా రంగం సిద్ధం చేసుకుంది. ఆమె తమిళంలో ఇంకా సినిమా చేయకుండా ఏమీ లేదు. తనకు పెద్దగా గుర్తింపు లేని సమయంలోనే ఇక్కడ జీవా సరసన ‘మాస్క్’ అనే సినిమాలో నటించింది. అది సరిగా ఆడలేదు. పూజాకు పేరు రాలేదు.

ఐతే ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అయ్యాక కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుంది పూజా. ఆమె ఒకేసారి విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం ఇప్పుడు ఖరారైంది. సంక్రాంతికి ‘మాస్టర్’తో పలకరించిన విజయ్.. దీని తర్వాత దిలీప్ నెల్సన్ కుమార్ అనే యువ దర్శకుడితో సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో పూజానే కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు గాను ఆమె ఏకంగా రూ.3.5 కోట్ల పారితోషకం అందుకోనుందట.

నయనతార కాకుండా తమిళంలో ఈ స్థాయిలో పారితోషకం అందుకున్న కథానాయిక మరొకరు లేరు. తెలుగులో సైతం పూజా ఇంత వరకు ఇంత మొత్తం ఏ సినిమాకూ ఛార్జ్ చేయలేదు. పూజా ఇప్పుడున్న డిమాండ్లో తననే కథానాయికగా తీసుకోవాలనే పట్టుదలతో భారీ పారితోషకం ఆఫర్ చేసి ఈ సినిమాకు ఒప్పించారట.