కంగనాపై 700 కేసులు

రాజకీయ నాయకులపైనో.. ఉద్యమకారులపైనో పదులు, వందల సంఖ్యల్లో కేసులుండటం మామూలే. కానీ ఒక సినీ నటిపై 700కు పైగా కేసులు ఉన్నాయంటే షాకవ్వాల్సిందే. ఆ నటి ఏదైనా రాజకీయ పార్టీలో చేరాక కేసులు నమోదైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగకుండానే.. సినిమాలు చేసుకుంటున్న నటి మీద ఇన్ని కేసులంటే నమ్మశక్యంగా అనిపించదు. కానీ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మీద 700కు పైగా కేసులు నమోదవడం వాస్తవం. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే వెల్లడించింది.

కొన్నేళ్లుగా కంగనా బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కథానాయికగా కొన్నేళ్ల పాటు అందరిలో ఒకరిలాగే ఉంది కంగనా. కానీ ‘క్వీన్’ సినిమాతో ఆమె ఇమేజ్ మారిపోయింది. ఇక అప్పట్నుంచి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ను పెంచుకుంది. ఆమె ఆత్మవిశ్వాసం కాస్తా అతి విశ్వాసంగా మారి.. తరచుగా ఏదో ఒక వివాదంలో తలదూర్చడాన్ని అలవాటుగా మార్చుకుంది.

ఏడాది నుంచి ఆమె రాజకీయాల్లోనూ వేలు పెడుతోంది. మహారాష్ట్రాలో అధికార పార్టీ శివసేనను టార్గెట్ చేయడం.. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరిపై నోరు పారేసుకోవడం.. మరోవైపు బాలీవుడ్లో వారసత్వ నేపథ్యం ఉన్న వాళ్లందరినీ కెలికి కెలికి గొడవలు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది కంగనాకు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న వాళ్లందరితోనూ కంగనా తగవు పెట్టుకోవడం.. ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల మీద కూడా అనేక అభాండాలు మోపడం సోషల్ మీడియా ఫాలోవర్లకు తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కేసులో కంగనా బాగానే ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో కంగనాకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా కంగనా ఒక ట్వీట్ వేసింది. తన ఇంట్లో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నానని.. తనపై ఏకంగా 700కు పైగా కేసులు నడుస్తున్నాయని, తనతో కలిసి మణికర్ణిక ఫిలిమ్స్‌లో భాగస్వామి అయిన అక్ష్ రనౌత్ ఒంటిచేత్తో ఆ కేసులన్నీ డీల్ చేస్తున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తనపై కుట్ర పూరితంగా కేసులు పెట్టిస్తోందని, అదే సమయంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని మాత్రం విడిచిపెడుతోందని కంగనా ఆరోపించింది.