వైష్ణవ్ తేజ్.. జంగిల్ బుక్

‘ఉప్పెన’ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజా. ఈ సినిమా అసాధారణ విజయాన్నందుకోవడంతో వైష్ణవ్‌కు బోలెడన్ని అవకాశాలు గ్యారెంటీ అనిపిస్తోంది. అతను అప్పుడే పారితోషకం కూడా పెంచేసినట్లు చెబుతున్నారు. విశేషం ఏంటంటే.. ‘ఉప్పెన’ విడుదల కావడానికి ముందే వైష్ణవ్ హీరోగా తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేశాడు.

లాక్ డౌన్ టైంలో సీనియర్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అతనో సినిమాలో నటించాడు. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. ఈ చిత్రంలోనూ వైష్ణవ్ చేసింది డీగ్లామరస్ రోలే. ఈ చిత్రం పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగుతుంది. వికారాబాద్ అడవుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ‘జంగిల్ బుక్’ అనే పాపులర్ టైటిల్‌ను ఈ సినిమా కోసం వాడుకుంటున్నారట.

రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దాన్ని క్రిష్ తనదైన శైలిలో చిత్రానువాదం చేసినట్లు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే టైటిలే పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారిందని.. క్రిష్ ‘జంగిల్ బుక్’ అనే టైటిల్‌ను దీనికి ఖరారు చేశాడని అంటున్నారు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారని అంటున్నారు. క్రిష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్లో సినిమా పూర్తయింది.

వైష్ణవ్‌కు ఇది మరో వైవిధ్యమైన సినిమా అవుతుందని, రకుల్‌కు కూడా మంచి పేరొస్తుందని అంటున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. దీని తర్వాత వైష్ణవ్ తేజ్.. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.